ఇష్టపడట్లేదు, పిల్లలకు కూడా చులకనే: బాబు ఆవేదన
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను చూడాలంటేనే ప్రజలు ఇష్ట పడటం లేదని, చిన్నపిల్లలు కూడా రాజకీయ నాయకులను చులకనగా చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని గ్రాండ్ కాకతీయ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సభాపతి కోడెల శివప్రసాద్, రాజ్యాంగ నిపుణులు సుభాష్ కష్యప్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం పట్ల శాసనసభ్యులకు అభినందనలు తెలిపారు. సభలో ఎలా మాట్లాడాలి, సమస్యలపై ఎలా చర్చించాలి, సభా మర్యాదలు వంటి విషయాలపై ఈ వర్క్ షాపు ద్వారా ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవచ్చన్నారు. లైవ్ ఛానళ్లు వచ్చాక చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన ప్రజలను గమనిస్తున్నారన్నారు. సభ్యులు హుందాగా మెలగాల్సిన అవసరం ఉందన్నారు.
ఎవరైనా మాట్లాడేటప్పుడు అడ్డుతగలకుండా, సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని సూచించారు. సభలో ఒక్క నిమిషానికి రూ.8 లక్షలు ఖర్చవుతోందని, కాబట్టి, సభా సమయం ఎంత విలువైనదో అర్థం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. సభలో సంప్రదాయాలు పాటించాలన్నారు. ఎన్నికైన వారిలో 95 శాతం మంది కొత్తవారే అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... సమాజానికి ఉపయోగపడే చర్చలో అందరు పాల్గొనాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎమ్మెల్యేలు అందరు కృషి చేయాలన్నారు. మనల్ని ఎన్నుకున్న ప్రజలు నష్టపోకుండా వ్యవహరించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు చూడాలంటే ప్రజలు ఇష్ట పడటం లేదని, చిన్నపిల్లలు కూడా రాజకీయాలను చూలకనగా చూస్తున్నారన్నరు. అసెంబ్లీలో నేతల మాటలు ప్రజలను ప్రభావితం చేస్తాయన్నారు.
ధర్మాన్ని అందరు కాపాడాలన్నారు. మనం ధర్మాన్ని కాపాడితే.. అది మనలను కాపాడుతుందన్నారు. అధికారం కంటే ధర్మం గొప్పదన్నారు. ధర్మపరిపాలనకు శ్రీరాముడు మంచి నిదర్శనమన్నారు. రాముడు మితభాషి, పూర్వభాషి, నవ్వుతూ పలకరించే వారన్నారు. తక్కువగా మాట్లాడేవాడని, ప్రజలను చూడగానే తానే ముందు పలకరించేవారని చెప్పారు. వీటి వల్లనే రాముడి పాలనను ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా అందరం ఒకేపక్షంగా సాగుదామన్నారు.
పేదరికం లేని సమాజమే తన తపన అన్నారు. రాష్ట్ర నిర్మాణానికి ఈ వర్క్ షాప్ వేదిక ద్వారా ప్రారంభం కావాలన్నారు. ఎక్కువగా బీపీ, షుగర్ రాజకీయ నాయకులకే వస్తాయన్నారు. చంద్రబాబు.. రాముడు అంటూ.. రాముడు అంటే చాలామందికి ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని, ఆయన కూడా మంచి పాలకుడేనని, అలాగే తాను చెప్పేది శ్రీరాముడి గురించి అన్నారు.