మీరు వెళ్లొద్దు: మంత్రులు-ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాకింగ్ ఆదేశం
విజయవాడ: మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. అందరు కార్తీక వనభోజనాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వన భోజనాలకు వెళ్తే.. ప్రత్యేకంగా ఆ కమ్యూనిటీకి టిడిపి దగ్గర అని ఇతరులు అభిప్రాయపడే అవకాశముందని కూడా చెప్పారని తెలుస్తోంది.
అయితే, కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి వన భోజనాలకు వెళ్లడం ఇదేం కొత్తగా ప్రారంభమైనది కాదని, ఇన్నాళ్లు వెళ్లి, ఇప్పుడు అలా వెళ్లకుంటే బాగుండదని మంత్రులు కూడా చంద్రబాబుతో అన్నారని తెలుస్తోంది. అలా హాజరుకాకపోయినా పార్టీకి, ప్రభుత్వానికి నష్టమేనని కొందరు చెప్పారని తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు, ఆయా కమ్యూనిటీలు కలిసి కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్తుంటాయి. ఇందులో భాగంగా పార్టీ నేతలు కూడా తమ తమ కమ్యూనిటీ వారితో కలిసి గ్రామాల్లో వనభోజనాలకు వెళ్తుంటారు. మంత్రులకు వారి వారి కమ్యూనిటీల నుంచి ఆహ్వానం అందుతుంది. అలాంటప్పుడు వెళ్తుంటారు.
మంత్రులను, ఇతర ప్రముఖులను వన భోజనాలకు పిలవడం, వారు రావడం ఆయా కమ్యునిటీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. అయితే, ఇప్పుడు చంద్రబాబు మాత్రం వన భోజనాలకు వెళ్లవద్దని చెప్పడం గమనార్హం.
కాగా, వన భోజనాలకు తమను పిలుస్తుంటారని, తమ కమ్యూనిటీ గ్రూపుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటుందని ఓ మంత్రి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, పరంపరగా వస్తున్న వన భోజనాల కార్యక్రమం విషయంలో చంద్రబాబు తీరు సరికాదనే వాదనలు కూడా ఉన్నాయి.