సైరస్మిస్త్రీ సాయంకోరిన బాబు, అందుకే వెళ్లలేదని పవన్
విశాఖ: హుధుద్ తుఫాను నేపథ్యంలో సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీతో ఫోన్లో మాట్లాడారు. తుఫాను బాధితులకు సాయం అందించాలని కోరారు. చంద్రబాబు విజ్ఞప్తికి సైరస్ స్పందించారు. తాము సోలార్ ల్యాంపులు, వాటర్ ఫిల్టర్లు పంపిస్తామని చంద్రబాబుకు తెలిపారు.
ప్రభుత్వ పని తీరుపై ప్రజల్లో హర్షం: పవన్ కళ్యాణ్
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం అన్నారు. ఖమ్మం బయలుదేరడానికి ముందు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు.
విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలవాలని ప్రజలకు, అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదనే విజయనగరం, శ్రీకాకుళంలో పర్యటించలేదన్నారు. సినీస్టార్స్ ఈవెంట్ తుపాను బాధితులకు ఉపయోగపడుతుందన్నారు.
తేరుకుంటున్న విశాఖ
హుధుద్ తుపాను ఫలితంగా భారీగా నష్టాన్ని చవి చూసిన విశాఖ నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. తుపాను బాధితులకు అందజేసేందుకు కౌంటర్లలో పాలు, కూరగాయలు సిద్దంగా ఉంచారు. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసర సరకులు అందజేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థ పునః ప్రారంభమైంది. బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి.
తుపాను బాధితులను ఆదుకొనేందుకు తమ వంతు సహాయంగా హాస్పిరా ఫార్మా సంస్థ రూ.60 లక్షలను విరాళంగా అందజేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కును అందజేశారు.
తుపాను ప్రభావంతో దెబ్బతిన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటిస్తున్నారు. పాడేరు, అరకు ప్రాంతాల్లో తుపాను ధాటికి భారీ నష్టం జరగడంతో సహాయక చర్యలు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆయన నిర్ణయించారు.
ఉత్తరాంధ్రలో తుపాను బాధితులను పరామర్శించేందుకు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ కూడా శుక్రవారం విశాఖ చేరుకున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం స్టీల్ ప్లాంట్, గాజువాక ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదారుస్తున్నారు.