రేపు మాట్లాడుదాం.. నేనూ రేపే చెప్తా!: బాబు ఫోన్, మెత్తబడిన జేసీ కానీ మెలిక
అనంతపురం/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. తన డిమాండ్లు నెరవేరేవరకు అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేది లేదని జేసీ చెప్పిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అనంతపురం రోడ్ వైండింగ్కు నిధుల కోసం జీవో జారీ చేశాక కొంత చల్లబడ్డారు.
అయితే, తాను అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొంటానని చెప్పిన జేసీ, ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి మరోసారి కలకలం రేపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనకు ఫోన్ చేశారు. దీంతో ఆయన కొంత మెత్తబడినట్లుగా తెలుస్తోంది. కానీ పూర్తిగా చంద్రబాబుకు మాత్రం ఓకే చెప్పలేదు.
చంద్రబాబు ఫోన్, మెత్తబడిన జేసీ, కానీ మెలిక
జేసీకి చంద్రబాబు ఫోన్ చేసి.. రేపు (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం, ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. మిగతా అంశాలు ఏమైనా ఉంటే అవిశ్వాసం తర్వాత చర్చిద్దామని చెప్పారు. రాజీనామా అంశంపై కూడా మాట్లాడుతూ.. తర్వాత మాట్లాడుదామని చెప్పగా.. జేసీ అంగీకరించారని తెలుస్తోంది. ఆయితే అవిశ్వాసం తర్వాత జేసీ డిమాండ్లు నెరవేరితేనే.. ఆయన సంతృప్తి చెందితేనే రాజీనామాపై వెనక్కి తగ్గే అవకాశముంది.
రాజీనామా సంగతి రేపు చెప్తా
జేసీ దివాకర్ రెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగే చర్చలో తాను పాల్గొంటానని చెప్పారు. రేపు ఉదయం తాను ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు. తన రాజీనామా సంగతి రేపు (శుక్రవారం) సాయంత్రం చెబుతానని అన్నారు. తాను ఎవరినీ బెదిరించలేదని చెప్పారు. తన వల్ల పార్టీకి మచ్చ రావడం ఇష్టం లేదని చెప్పారు.
కేశినేని నానికి బదులు గల్లా జయదేవ్
అవిశ్వాస తీర్మానంపై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కే టీడీపీ తరఫున తొలుత మాట్లాడే అవకాశం వచ్చింది. ఎంపీ కేశినేని నాని చర్చను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ గల్లా జయదేవ్కే టీడీపీ అవకాశమిచ్చింది. గల్లా తర్వాత ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడులు మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని కేశినేని తెలిపారు.
చాలా కీలకమైన రోజు
చంద్రబాబు టీడీపీ ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభలో ఐదు కోట్ల మంది ప్రజల గొంతు వినిపించాలని ఎంపీలకు సూచించారు. రేపు చాలా కీలకమైన రోజు అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదో చారిత్రక అవకాశమని, స్ఫూర్తి దాయకమైన సమయమన్నారు.