"చంద్రబాబు దళిత ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారు.."
ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిందిపోయి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పట్ల వివక్ష చూపిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళిత ఎమ్మెల్యేల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు గౌరు సుచరిత, ఐజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యేలను సీఎం అవమానిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పోలవరం, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు పునాదులు వేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మరోసారి వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిందిపోయి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పట్ల వివక్ష చూపిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి చంద్రబాబే అడ్డుపుడుతున్నారని ఆరోపించారు.

కాగా, సోమవారం నాడు తడనకపల్లెలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్యకు చంద్రబాబుకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. సభలో మాట్లాడిన ఐజయ్య.. ముచ్చుమర్రి ప్రాజెక్టు సహా రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి భిక్షేనని అభిప్రాయపడ్డారు.
దీంతో ఎమ్మెల్యే ఐజయ్య ప్రసంగానికి అడ్డుపడిన సీఎం చంద్రబాబు ఆయన మైక్ కట్ చేయించారు. ఐజయ్య వైఎస్ పేరును ప్రస్తావించిన సమయంలో జనం నుంచి కేకలు, ఈలలు వినిపించడం గమనార్హం. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేను మాట్లాడనివ్వకుండా సీఎం అడ్డుకోవడం దారుణమంటూ మంగళవారం నాడు ఐజయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications