అమరావతి చరిత్ర తెలియని చరిత్రహీనులు, రాజధాని మార్పుపై తిరుపతి ర్యాలీలో చంద్రబాబు ధ్వజం
రాజధానిని ఎందుకు మారుస్తున్నారో సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ నేతలను గృహ నిర్భందం చేయడం సరికాదని, తీరు మార్చుకోవాలని సూచించారు. తనను ఎయిర్పోర్టులోనే అరెస్ట్ చేస్తారని ప్రచారం చేయడం ఏంటీ అని మండిపడ్డారు. శనివారం తిరుపతిలో అమరావతి పరిరక్షణ ర్యాలీలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
విరాళాల సేకరణ
ర్యాలీలో జేఏసీ నేతలతోపాటు భారీగా ప్రజలు హాజరయ్యారు. అమరావతి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు జోలె పట్టి విరాళాలు సేకరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకొని, రాజధానిని అమరావతి కేటాయించామని చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం నియంత పోకడలతో నడుస్తోందని విమర్శించారు.
అసత్య ప్రచారం
అమరావతి రాజధాని మునిగిపోతుందని అసత్య ప్రచారం చేశారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం సరికాదని, ఎందుకంత లెక్కలేనితనం అని మండిపడ్డారు. చరిత్రహీనులైన వైసీపీ నేతలకు అమరావతి చరిత్ర తెలియదని విమర్శించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అంటున్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటీ ? దమ్ముంటే విచారణ చేయించాలని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
జోలెపట్టి
రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఏలూరు, రాజమండ్రిలో చంద్రబాబు ర్యాలీ నిర్వహించారు. అమరావతి రాజధాని కోసం చంద్రబాబు నాయుడు జోలెపట్టి ప్రతీ ఒక్కరి నుంచి విరాళాలు సేకరించారు. రైతులు, మహిళలు విరాళాలు అందజేశారు.