బీజేపీ ఓటమి ఆనందాన్నిచ్చింది: జగన్, పవన్పై చంద్రబాబు విమర్శలు
అమరావతి/అనంతపురం: కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓటమి తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మనకు అన్యాయం చేసిన ఇలాంటి పార్టీలకు తెలుగువారు ఎక్కడున్న ఓడించాలని తాను ఇచ్చిన పిలుపు మేరకే బీజేపీని ఓడించారని తెలిపారు.
బీజేపీతో ఓ పార్టీ కేసుల కోసం..
బీజేపీని ఓడించి తెలుగు వారి దెబ్బెంటో చూపించారని అన్నారు. కేసులు మాఫీ చేయించుకునేందుకు బీజేపీతో ఓ పార్టీ చేతులు కలిపిందని, ఆ పార్టీ గెలుపు కోసం కర్ణాటకలో పనిచేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనుద్దేశించి చంద్రబాబు ఆరోపణలు చేశారు. మైనింగ్ కుంభకోణంలో నిందితుడైన గాలి జనార్ధన్ రెడ్డి సాయం బీజేపీ తీసుకుందని అన్నారు.
బీజేపీ ద్రోహం చేసింది..
కర్ణాటకలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి దారి చూపిందని చంద్రబాబు చెప్పారు. ఏపీకి బీజేపీ ద్రోహం చేసిందని అన్నారు. కష్టల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోలేదని మండిపడ్డారు. 29సార్లు కేంద్రం చుట్టూ తిరిగినా న్యాయం చేయలేదని అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. అందుకే తాను కొన్నిసార్లు తగ్గానని అన్నారు.
జగన్, పవన్లపై విమర్శలు
రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కేంద్రం తీరును ఎండగట్టకుండా తనపై విమర్శలు చేస్తున్నారని వైసీసీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనపై, తమ పార్టీపై చేస్తున్న అవినీతి ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.
కావాలనే దెబ్బతీస్తున్నారు..
తిరుమల దేవస్థానం వివాదంపై చంద్రబాబు స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగానే కొందరు టీటీడీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని అన్నారు. లేనిపోని ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మొన్నటివరకు పొగిడినవారు ఇప్పుడు.. తిడుతున్నారని అన్నారు. టీటీడీ ప్రతిష్టను టీడీపీనే కాపాడిందని చంద్రబాబు చెప్పారు.