జగన్.. ఇక చాలంటున్నారు! మళ్లీ నన్నే కోరుకుంటున్నారు: చంద్రబాబు సంచలనం
శ్రీకాకుళం: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై విసుగొచ్చిందని.. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మళ్లీ తననే సీఎంగా కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు.

ఇసుకాసురిడిలా..
జగన్మోహన్ రెడ్డి సర్కారు విధానాల వల్ల ఇసుక కొరత ఏర్పడిందని, దీంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇసుకను ఉచితంగా ఇస్తామంటే విమర్శించారని అన్నారు. రాష్ట్రంలో బంగారమైనా దొరుకుతుందేమో గానీ.. ఇసుక మాత్రం దొరకడం లేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుక విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఇసుకాసురుడిగా మారిపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

అంధకారంలోకి నెట్టారు..
టీడీపీ హయాంలో కరెంటు కోతలు లేకుండా 24గంటలపాటు విద్యుత్ అందిస్తే.. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. దోమలపై యుద్ధమంటే తమను అప్పుడు విమర్శించిందని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు నేతలు వెళ్లినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆనాటి నుంచే జగన్ పతనం..
తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే తాను ఎవరికీ భయపడనని అన్నారు. తనపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి 26 కేసులు పెట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల మనసులు గెలుచుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి వైఎస్ జగన్ సర్కారు పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.

మీ ముఖాలకు పూసుకోండి రంగులు..
ప్రభుత్వ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడమేంటని చంద్రబాబు నాయుడు నిలదీశారు. మీ ముఖాలకు ఆ రంగులు వేసుకోవాలని వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పొట్ట కొట్టారని మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications