చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు: ఆగ్రహం, మహిళలపై ఇంత అరాచకమా? అంటూ ఫైర్
అమరావతి: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి నరసరావుపేట పర్యటనకు బయల్దేరిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.
చంద్రబాబును అడ్డుకోవడంతో..
పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు కాన్వాయ్ బయటకు రాగానే వాహనాలను పోలీసులు నిలిపేశారు. దీంతో చంద్రబాబు వాహనం నుంచి దిగి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో కాసేపు వాగ్వాదం జరిగింది. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ర్యాలీ చేస్తుంటే ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. తన వెంట వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరమేంటని నిలదీశారు. శాంతియుత నిరసనలను ఎందుకు అండ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
వైసీపీ నేతలు చేస్తే సహకరిస్తారా?
డీజీపీ గౌతమ్ సవాంగ్ చట్ట వ్యతిరేక చర్యలను విడనాడాలని చంద్రబాబు హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల ప్రదర్శనలకు పోలీసులు దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారికి మాత్రం 144, పోలీస్ యాక్ట్ 30ని వర్తింపజేయడం లేదని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు అమరావతి పరిరక్షణ సమితి నిరసన తెలుపుతుంటే కఠిన నిర్బంధ చర్యలతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
మహిళలపై ఇంత అరాచకమా?
దుర్గమ్మ గుడికి వెళ్తున్న మహిళలను అడ్డుకుని వారిపై పోలీసులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళా హక్కులను కాలరాయడం కాదా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను బూటుకాళ్లతో తన్నడం, లాఠీలతో కొట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా? అని చంద్రబాబు నిలదీశారు.
డీజీపీదే బాధ్యత..
శాంతియుత నిరసనలకు కూడా ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు. దీర్ఘకాలం 144 సెక్షన్ అమలు చేయడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పినా.. ఇన్ని రోజులపాటు అమరావతి పరిధిలో అమలు చేయడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యాలకు డీజీపీనే బాధ్యత వహించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా డీజీపీ చట్ట ప్రకారం నడుచుకోవాలని అన్నారు.
మహిళా రైతుకు పరామర్శ
ఇది ఇలావుండగా, అంతకుముందు చంద్రబాబు విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మిని చంద్రబాబు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. అమరావతి ఆందోళనల్లో భాగంగా మందడంలో నిరసన చేస్తున్న సమయంలో పోలీసుల దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అనారోగ్యంతో ఉన్న తండ్రిని పోలీసులు తీసుకెళ్తుండటంతో అడ్డుకోబోయిన శ్రీలక్ష్మిని పోలీసులు దారుణంగా కొట్టారని చంద్రబాబు మండిపడ్డారు.