‘సిట్టింగ్’ ఎమ్మెల్యేలకు నిద్రలేని రాత్రులు: చంద్రబాబు ఏం చేస్తున్నారంటే?
తెలుగదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఇప్పుడు సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
అమరావతి: తెలుగదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఇప్పుడు సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పార్టీతోపాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు సుమారు 50రోజులపాటు సొంత నియోజకవర్గంలోనే ఉండాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేయాలి.

ప్రజలపై ఆగ్రహం
అంతేగాక, ఆయా నియోజకవర్గాల్లోని దాదాపు అన్ని గ్రామాలను, ఇళ్లను నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు సందర్శించాల్సిందే. ఇది పార్టీకి లాభం చేసే కార్యక్రమమే అయినప్పటికీ పలు ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేదు అనుభవం ఎదుర్కొవాల్సి వస్తోంది. మూడేళ్లుగా కనిపించకుండా.. ఒకేసారి ఇలా రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ కన్నేసిన చంద్రబాబు
కాగా, గత ఎన్నికల్లో తొలిసారిగా టికెట్ దక్కించుకుని ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఈ కార్యక్రమం ఆందోళనకు గురిచేస్తోంది. నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేల వివరాలను, వారికి ఎదురైన అనుభవాలపై కూడా పార్టీ అధినేత చంద్రబాబు కన్నేయడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

బుకు రిపోర్టు: ఎమ్మెల్యేల్లో ఆందోళన
తరచూ ప్రజల్లో ఉండే ఎమ్మెల్యేలకు ఈ కార్యక్రమం సానుకూలంగా ఉండగా, ఎప్పుడో ఒకసారి నియోజకవర్గంలో పర్యటించే ఎమ్మెల్యేలకు మాత్రం ప్రజల నుంచి విమర్శలు తప్పడం లేదు. అయితే, ఈ ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై చంద్రబాబు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుని ఆయా ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమపై అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఆందోళనలో పడ్డారు.

కంటి మీద కునుకు లేకుండా..
ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం బాగానే ఉన్నా.. కొందరు ఎమ్మెల్యేలకు మాత్రం కంటి మీద కునుకు కూడా లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి మంచి పని చేశారంటూ ప్రజలు భావిస్తుండగా, కొంత మంది ఎమ్మెల్యేలకు మాత్రం ఆశనిపాతంలా మారింది.

సిట్టింగులకు ఫీవర్
అంతేగాక, ప్రజల్లోకి వెళుతున్న పలువురు ఎమ్మెల్యేలకు కొన్ని నియోజకవర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనకు అందిన నివేదికల ఆధారంగా సిట్టింగులకు మరోసారి టికెట్ ఇస్తారా? లేదా అనేది సందేహంగా మారింది. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న కొందరు ఎమ్మెల్యేలకు 2019 ఎన్నికల ఫీవర్ ఇప్పుడే మొదలైంది. అయితే, బాబు నిర్ణయం మాత్రం 2019 ఎన్నికల నాటికే వెల్లడి కానుంది.












Click it and Unblock the Notifications