ఓటింగ్ వేళ చంద్రబాబు బిగ్ స్కెచ్ - సీన్ ఛేంజ్..!!
ఏపీలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. ఎన్నికల్లో గెలుపు జగన్, చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు పైన ఇద్దరు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పోటీ హోరా హోరీగా కనిపిస్తుంది. కూటమినేతలు పూర్తిగా చంద్రబాబు వ్యూహాల పైనే నమ్మకం పెట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు టిడిపికి నౌ ఆర్ నెవర్ గా మారింది. దీంతో పోలింగ్ వేల రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
చంద్రబాబు కసరత్తు
ఎన్నికల్లో గెలిచేందుకు రెండేళ్ల కాలంగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశం వదులుకోకుండా అడుగులు ముందుకు వేశారు. వ్యూహాత్మకంగా పొత్తులతో ముందుకు వచ్చారు. పవన్ తో పొత్తు ద్వారా మెజార్టీ ఓట్ బ్యాంకు ను తన వైపు తిప్పుకునేందుకు కారణమైంది. ఏపీలో అధికారం దక్కాలంటే కీలకమైన గోదావరి జిల్లాలో పవన్ ద్వారా కూటమి పట్టు సాధించింది. అదే సమయంలో బిజెపితో పొత్తుతో యువత మద్దతు కలిసి వచ్చేలా చంద్రబాబు ప్రణాళికలు అమలు చేశారు. ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు.

వ్యూహాత్మక అడుగులు
జగన్ సంక్షేమ ఓట్ బ్యాంకు ను టార్గెట్ చేస్తూ ఏడాది క్రితమే సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని అందిస్తానంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన ట్రాక్ రికార్డు గురించి వివరిస్తూ ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలో పెరిగిన అప్పుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బిజెపి అని ప్రచారం వేల ఏపీలో ఆ పార్టీతో పొత్తు టీడీపికి కలిసి వచ్చే అంశం. ప్రధాని మోడీ సైతం తన ఎన్నికల ప్రచారంలో డబుల్ ఇంజన్ సర్కార్ గురించి పదేపదే చెప్పటం కూటమికి సానుకూలంగా మారుతుంది.

గెలుపు పై ధీమా
ఇక కీలకమైన పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగుల మద్దతు ఎక్కువ శాతం కూటమికే దక్కిందని ప్రచారం జరుగుతుంది. అసలైన పోలింగ్ వేల ఈ ప్రచారం టిడిపికి కలిసివస్తుంది. ఇక అభ్యర్థుల విషయంలో అవసరమైన మార్పులు చేయటంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన పోల్ మేనేజ్మెంట్ విషయం పైన అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ వ్యూహాలకు దీటుగా తాము అమలు చేయాల్సిన కార్యాచరణను నిర్దేశిస్తున్నారు. ఏపీలో ఓటు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి తరలివస్తున్నారు. ఈ ఓటర్లను తమ వైపు మలుచుకోవటానికి తొలి నుంచి టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జగన్ పైన ఉన్న వ్యతిరేకతను పూర్తిగా తమ వైపు తిప్పుకోవటం కోసం కూటమి నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈసారి అధికారం ఖాయమనే ధీమాతో చంద్రబాబు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications