మహా నాయకుడు దీక్ష చేశారు, దొంగ లెక్కలు రాసుకున్నంత ఈజీ కాదు: జగన్పై బాబు
విజయవాడ: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ను మహా నాయకుడంటూ ఎద్దేవా చేశారు. పనులు చేయడం దొంగ లెక్కలు రాసుకున్నంత సులభం కాదని అన్నారు. విభజన కారణంగా కట్టుబట్టలతో వచ్చామని అన్నారు. ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన తర్వాత ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
తాను ఎక్కడా రాజీ పడడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెసు మనల్ని అన్ని రకాలుగా దెబ్బ తీసిందని విమర్సించారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని ఢిల్లీకి వెళ్లి అడగాల్సిన పరిస్థితి రావడం కాంగ్రెసు వల్లనే అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సమస్యలను అన్ని రకాలుగా పరిష్కరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి కల్పించారని అన్నారు.
దేశంలోని పది రాష్టాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఆ పది రాష్ట్రాలు కూడా ఇంకా వెనకబడే ఉన్నాయని, పదేళ్లు ప్రత్యేక హోదా అమలు చేసినా అభివృద్ధి సాధించలేకపోయాయని, అభివృద్ధి సాధించడమనేది దొంగ లెక్కలు రాసుకున్నంత సులభం కాదని, కష్టపడితే అవుతుందని చంద్రబాబు అన్నారు.

తాము కోరుకున్న విభజన కాదని, కోరుకోని విభజనను రుద్డడం వల్ల ఎపి ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఎపి ప్రజలు కష్టాలు పడినంతగా ఏ రాష్ట్ర ప్రజలు కూడా పడలేదని ఆయన అన్నారు. మనం తొలుత చెన్నైలో ఉన్నాం, తర్వాత పోట్టీ శ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, కర్నూలులో మూడేళ్లు ఉన్నామని, అందరం కలిసి ఉండాలనే డిమాండ్ రావడంతో ఎపి ఏర్పడిందని, హైదరాబాదులో 65 ఏళ్లు కష్టపడ్డామని, చివరకు కట్టుబట్టలతో వచ్చామని ఆన్నారు.
ఆ మహానాయకుడు కర్నూలులో మాట్లాడారు, రాజకీయాలు తెలియవు, ఏమీ తెలియకుండా ఏదో మాట్లాడుతారని ఆయన జగన్ను ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడంలో తాను ముందుంటానని, తనకు ప్రత్యేక హోదా రాకూదని ఉంటుందా అని అన్నారు. అవన్నీ మాట్లాడితే వారి చేతగానితనం, అసమర్థత బయపడుతాయని అన్నారు.
వెంట మనుషులు లేరు గానీ ఆయనొక్కడే మాట్లాడుతుంటారని, అలా మాట్లాడితే విశ్వసనీయత ఉండదని, భవిష్యత్తు ఉండదని ఆయన పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తనకు బాధ్యత ఉందని, పోరాటం చేస్తున్నానని, ప్రయోజనాలు కలిగే విధంగా కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. ఎగువ రాష్ట్రాలు, తమ రాష్ట్రంతో దామాషా ప్రకారం నదీ జలాలు పంచుకోవాలని, అది చట్టంలో కూడా ఉందని, చట్టాన్ని అమలు చేయాలని తాను అడుగుతున్నానని ఆయన అన్నారు. వరదలు వచ్చినప్పుడు వదిలేస్తాం, రానప్పుడు మేమే ఆ నీళ్లన్నీ వాడుకుంటామని ఎగువ రాష్ట్రాలు అంటే సరి కాదని అన్నారు. అందుకే కమిషన్ వేయాలని అడుగుతున్నామమని అన్నారు.












Click it and Unblock the Notifications