రివర్స్: బాబు హింట్, జగన్తో గేమ్: 'వాచీ లేకుండా లోకేష్ని ఎలా చదివించారు'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని సొంత పార్టీ నేతలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హింట్ ఇచ్చారని తెలుస్తోంది.
భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ చేరికలకు కర్నూలు జిల్లా నేతలు కూడా సరేనని చెప్పారు. టిడిపిలో చేరితే భూమా నాగిరెడ్డిని లేదా కూతురు అఖిల ప్రియను మంత్రి పదవి వరించే అవకాశముంది. వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
Also Read: బాబు వ్యూహం: హార్డ్ కోర్ ఔట్, జగన్కు దెబ్బ
శనివారం చంద్రబాబు కర్నూలు జిల్లాకు చెందిన నేతలు కెఈ కృష్ణమూర్తి తదితరులతో భేటీ అయ్యారు. భూమా చేరికతో లాభం తెలిపారు. జిల్లా టిడిపి నేతలు కూడా అంగీకరించారు. 2019 నాటికి టిడిపి బలహీనంగా ఉన్న జిల్లాల్లో బలం పెంచుకోవడమే చంద్రబాబు, నారా లోకేష్ లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు.
కర్నూలు జిల్లాలో భూమా కుటుంబం టిడిపిలో చేరితే అది వైసిపి అధినేత జగన్కు అతిపెద్ద షాక్ అని చెప్పవచ్చు. దీనికి తోడు కడప జిల్లాలో ఏడుగురు కార్పోరేటర్లు, డిప్యూటీ మేయర్కు నారా లోకేష్ గాలం వేశారు. వారు చిక్కారని తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో వారు టిడిపిలో చేరవచ్చునని అంటున్నారు.
వైసిపి బుజ్జగింపులు
టిడిపిలోకి వెళ్తారనే ప్రచారం నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, కడప జిల్లా డిప్యూటీ మేయర్ అరీఫుల్లాలను బుజ్జగించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. మరోవైపు, వైసిపి నేతలు టిడిపి, చంద్రబాబు పైన దుమ్మెత్తి పోస్తున్నారు.
ఉంగరం, వాచీ లేదన్న బాబుకు వైసిపి కౌంటర్
ఆదివారం నాడు వైసిపి ఎమ్మెల్యే నారాయణ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉంగరం, వాచీలేని కుమారుడు నారా లోకేష్ను లండన్లో ఎలా చదివించారో చెప్పాలని ప్రశ్నించారు. అభివృద్ధి పథం మానేసి చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు.
తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని, దీంతో తమ పైన అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు, వాచీ, ఉంగరం కూడా లేవని చంద్రబాబు శనివారం చెప్పారు. దీనిపై వైసిపి నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఉప్పులేటి కల్పన తదితర నేతలు కూడా చంద్రబాబుపై మండిపడ్డారు.
Also Read: చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్: ఒక దెబ్బకు రెండు పిట్టలు, ఎలా?
జగన్కు ధీటుగా పావులు కదుపుతున్నారా?
ఇటీవల కాపు గర్జన తదితర అంశాలపై టిడిపి నేతలు వైసిపి అధినేత జగన్ పైన తీవ్రంగా మండిపడ్డ విషయం తెలిసిందే. జగన్ కులచిచ్చు రాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం వెనుక కూడా జగన్ ఉన్నారనే వాదనలు ఉన్నాయి. ఇటీవలి వరకు చంద్రబాబు సమస్యలు ఎదుర్కొన్నారు.
ఇప్పుడు చంద్రబాబు.. జగన్కు నిద్రలేకుండా చేస్తున్నారని అంటున్నారు. ఎంతమంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారనే విషయాన్ని పక్కన పెడితే.. ఒకరిద్దరు మాత్రం చేరవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. నిన్నటి దాకా తనకు నిద్రలేకుండా చేసిన జగన్కు ఇప్పుడు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా, టిడిపిలోకి చేరికల విషయంలో లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.