జగన్ వద్దు: కన్విన్స్ చేసేందుకు బాబు, ఏపీపై షా సర్వేలో ఏం తేలిందంటే..
వచ్చే ఎన్నికల్లోను టిడిపి - బిజెపి కలిసే ముందుకు సాగుదామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ముందు ప్రతిపాదన పెట్టారని తెలుస్తోంది.
విజయవాడ: వచ్చే ఎన్నికల్లోను టిడిపి - బిజెపి కలిసే ముందుకు సాగుదామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ముందు ప్రతిపాదన పెట్టారని తెలుస్తోంది.
చదవండి: ప్రభాస్కు మోడీ బంపరాఫర్?
2019 వరకు టిడిపితో పొత్తు కొనసాగుతుందని బిజెపి నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే. విభజన నేపథ్యంలో ఏపీకి ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ కారణాలతో బిజెపితో కలిసి ముందుకు సాగాలని చంద్రబాబు భావిస్తున్నారు.
అమిత్ షాను కన్విన్స్ చేసేందుకు చంద్రబాబు
తదుపరి ఎన్నికల్లోను పొత్తుతో ముందుకు వెళ్దామని అమిత్ షాకు గురువారం నాటి భేటీ సందర్భంగా చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లాలని ఏపీ బిజెపి నేతలు భావిస్తున్నారు.
బిజెపి మనసులో..
అంతేకాకుండా, టిడిపితో తెగతెంపులు చేసుకొని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో అంతర్గత ఒప్పందంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్లి, ఆ తర్వాత వైసిపి - బిజెపి పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నయి. ఢిల్లీ పెద్దల మనసుల్లోను అదే ఉందని అంటున్నారు.
దానిని గుర్తించిన చంద్రబాబు..
బిజెపి మనసులోని మాటను గుర్తించిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లోను కలిసి ముందుకు సాగుదామని బిజెపి జాతీయ అధ్యక్షులతో చెప్పారని తెలుస్తోంది. బిజెపిలో అమిత్ షా - మోడీ చెప్పిందే ఫైనల్!
అమిత్ షాను కన్విన్స్ చేసేందుకు..
గత ఎన్నికల్లో తెలంగాణ బిజెపి నేతలు టిడిపితో పొత్తు వద్దు మొర్రో అన్నారు. కానీ అధిష్టానం ఆదేశించడంతో వారు కలిసి వెళ్లక తప్పలేదు. కాబట్టి ఏపి బిజెపి నేతలు మనపై విమర్శలు చేస్తే వారి అధిష్టానం చూసుకుంటుందని సొంత పార్టీ నేతలకు సర్ది చెప్పిన చంద్రబాబు.. అమిత్ షా ద్వారా వచ్చే ఎన్నికల్లోను ముందుకు వెళ్లేందుకు కన్విన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
జగన్ వద్దు..!
ఇద్దరం కలిసి పని చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లోను అలాగే పని చేద్దామని, టిడిపి - బిజెపి మధ్య విభేదాలు అని, బిజెపికి జగన్ దగ్గరవుతున్నారనే ప్రచారం సాగుతోందని చంద్రబాబు ఈ సందర్భంగా అమిత్ షాకు చెప్పారని తెలుస్తోంది.
అమిత్ షా సర్వే..
మరోవైపు, చంద్రబాబు పాలనపై అమిత్ షా ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది. యూపీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా సర్వే చేయించామని, రాష్ట్రంలో మన కూటమి పరిస్థితి బాగుందని, మీ పని తీరు బాగుందని, ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉన్నా మొత్తంగా మీ ప్రభుత్వంపై సానుకూలత ఉందని అమిత్ షా చెప్పారని తెలుస్తోంది.