ట్రిక్కులు.. జిమ్మిక్కులు..: బాబు ‘నంద్యాల’ వ్యూహం ఇదీ...
హైదరాబాద్/ అమరావతి: త్వరలో కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ శ్రేణులను నైతిక స్థైర్యాన్ని పెంపొందించే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు.
అందులో భాగంగా నంద్యాల ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందేందుకు అవసరమైన ప్రతి ట్రిక్, ప్రతి ఒక్క వ్యూహం, ప్రతి ఎత్తు పకడ్బందీగా అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఒకవేళ నంద్యాల స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఓటమి పాలైతే రాష్ట్రమంతా పార్టీపై, పార్టీ శ్రేణులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని టీడీపీ అధినాయకత్వం ఆందోళన చెందుతోంది.
ఉప ఎన్నిక నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించకపోవడంతో మున్ముందుగా నంద్యాల ప్రజల మనస్సు చూరగొనేందుకు అధికార టీడీపీ వ్యూహాత్మకంగా ముందుగా సాగుతోంది. గత శని, ఆదివారాల్లో నంద్యాల అసెంబ్లీ స్థానం పరిధిలో విస్త్రుతంగా పర్యటించారు. వివిధ సామాజిక వర్గాల ఓటర్లకు రకరకాల రాయితీలు, వరాలు ప్రకటించారు. పలు అభివ్రుద్ధి పథకాలను ప్రారంభించారు.
ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేయాలని సీఎం ఆదేశం
సహజంగానే మీడియాను ఆకర్షించేందుకు జర్నలిస్టులకు ఉచితంగా మూడు బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఆశ చూపారు. ‘వచ్చే ఏడాది జర్నలిస్టులందరికీ మూడు బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తుందని మా ప్రభుత్వం హామీ ఇస్తుంది. నేను పూర్తిగా హామీ అమలు చేస్తా' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ హామీని నమ్మని జర్నలిస్టులు ప్రతిస్పందించలేదు. కానీ తాను ఇచ్చిన హామీపై సంతోషాన్ని తెలియజేసేందుకు చప్పట్లు కొట్టాలని సీఎం చంద్రబాబు కోరడం.. దానికి తప్పనిసరి పరిస్థితుల్లో పాత్రికేయులు గట్టిగా చప్పట్లు కొట్టక తప్పలేదు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీని విషయమై ఏపీ సీఎం చంద్రబాబు తెలివిగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నంద్యాల అసెంబ్లీ స్థానం పరిధిలో మాత్రమే కాక.. రాష్ట్రం అంతటా జర్నలిస్టులు అందరికీ త్రిబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు కూడా. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలేవీ ఇప్పటివరకు అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. సమయం వచ్చినప్పుడల్లా దాట వేయడం అలవాటుగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండటంతో రెండు రోజుల పాటు నంద్యాలలో పర్యటించిన ఇళ్ల నిర్మాణానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Recommended Video
విశాఖ మాదిరిగా నంద్యాలను తీర్చిదిద్దాలని ఆదేశం
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం ఇంటింటికీ కొళాయిలు బిగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి రూ.2లకు 20 లీటర్ల తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నం నగరం మాదిరిగా నంద్యాల పట్టణాన్ని అందంగా అలంకరించాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి ఫైబర్ గ్రిడ్ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టినందుకు విద్యుత్ స్తంభాలను మార్చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. తర్వాత జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రజల సమస్యలపై అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ సత్సంబంధాలు పాటిస్తూ అభివ్రుద్ధి పథకాలు అమలు చేయించుకోవాలని కోరారు.
ముస్లిం పెద్దలకు ఇలా బాబు హుకూం
గత నెలలో రంజాన్ సందర్భంగా నంద్యాలలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు రూ.90 లక్షల విలువైన అభివ్రుద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ముస్లింలందరినీ టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డికి ఓటేయాలని అభ్యర్థించారు. నంద్యాల పరిధిలో 13 వేల కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాగా, తాజాగా తమ సమస్యలు పరిష్కరించాలని తనను కలిసిన ముస్లిం మత పెద్దలకు ‘మీరేం చేస్తారో నాకు తెలీదు. ప్రార్థనే చేస్తారో.. కన్విన్సే చేస్తారో.. ఓట్లన్నీ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికే పడాలి' అని సీఎం చంద్రబాబు హుకుం జారీ చేశారు. ఓట్లు వేయకుండా ఊరికే మాట్లాడితే సహించనని తెగేసి చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ తనను కలిసిన ముస్లిం పెద్దలకు సీఎం షాక్ ఇచ్చేలా మెలికపెట్టారు.
పనులు కావాలనుకుంటే...
పనులు కావాలంటే ముందు టీడీపీకి ఓట్లు వేయాలని.. ఆ తర్వాతే తనను కలవాలని సీఎం చంద్రబాబు షరతు పెట్టారు. అప్పుడే కావాల్సిన పనులు చేస్తానని స్పష్టం చేశారు. ‘మీకున్న 56 వేల ఓట్లలో ఒక్క ఓటు కూడా వేరే వాళ్లకు వెళ్లకూడదంటూ హెచ్చరించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేయాలని సూచించారు. కాగా, దీనిపై ముస్లింలతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం చంద్రబాబు ఈవిధంగా అడ్డదారులు తొక్కుతుండటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.