జగన్కు ఇంటర్వ్యూ ఇవ్వడమేంటి, మరి మాల్యాకు ఇస్తారా: ఢిల్లీ పెద్దలపై బాబు ఆగ్రహం
ఒక ఆర్థిక నేరస్థుడు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు ఇంటర్వ్యూ ఇవ్వడం సబబు కాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ఒక ఆర్థిక నేరస్థుడు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు ఇంటర్వ్యూ ఇవ్వడం సబబు కాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శనివారం విశాఖలోని సింహాచలం ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు తన కేబినెట్లోకి వైసిపి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించడంపై జగన్ ఢిల్లీలో వివిధ పార్టీ నేతలకు ఫిర్యాదు చేస్తున్నారు.
జగన్కు ఆ స్థాయి లేదు
జగన్ వంటి ఆర్థిక నేరస్థుడికి వారు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏమిటని చంద్రబాబు తప్పుబట్టారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చట్టాలు, రాజ్యాంగం గురించి మాట్లాడడం అపహాస్యంగా ఉందన్నారు. ఆ స్థాయి అతనికి లేదన్నారు.
వైయస్ హయాంలోను.. అయినా స్పీకర్ పరిధిలోనిది
వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెరాస ఎమ్మెల్యేలను, ఆ తర్వాత జగన్ కూడా టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు వైసిపి మీద నమ్మకం లేక టిడిపిలోకి ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. అయినా ఇది స్పీకర్ పరిధిలోని వ్యవహారమని చెప్పారు. ఇవేవీ తెలియకుండా ప్రవర్తిస్తున్నారన్నారు.
మాల్యాకు ఇంటర్వ్యూలు ఇస్తారా
విజయ్ మాల్యా, సుబ్రతారాయ్, మధు కోడా, హర్షద్ మెహతా, దావూద్ ఇబ్రహీం ఇలాంటి వారెవరికీ ఢిల్లీ పెద్దలు ఇంటర్వ్యూలు ఇవ్వరని, మరి జగన్కు ఇవ్వడం సబబా? కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు బెయిల్ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ మీద ఢిల్లీ పెద్దలు ఆయనను అడగాల్సిందని అభిప్రాయపడ్డారు.
జగన్కు నేను ఉద్యోగమిస్తే.. విదేశాల్లో ప్రతిపక్ష నేత ఎవరంటే..
దేశంలో ఎక్కడారాని ఉద్యోగాలు రాష్ట్రంలోనే వచ్చాయని చంద్రబాబు చెప్పారు. జగన్కు ఉద్యోగం లేదని బాధపడుతున్నందుకే రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు నేనెక్కడ ఉద్యోగమిస్తాననని, ఒకవేళ ఇస్తే రాష్ట్రం మొత్తం నాశనమయ్యేదన్నారు.
ప్రపంచంలో నేను ఎక్కడికెళ్లినా మీ ప్రతిపక్షం ఎవరని అడిగితే ఏమని చెప్పాలన్నారు. తమ ప్రతిపక్షనేత ఒక ఆర్థిక నేరస్తుడని, ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు నడుస్తున్నాయని, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తాడని చెప్పమంటారా? అన్నారు.
జగన్కు సిబిఐపై నమ్మకం సరే..
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లి అగ్రిగోల్డ్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారని, అంటే సీబీఐ విచారణ మీద జగన్కు నమ్మకం ఉందని, అలా అయితే మంచిదే అన్నారు. అదే సీబీఐ ఆయన బెయిల్ నిబంధనలను జవదాటుతున్నారని, దానిని రద్దు చేయాలని కోరిందని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ దీనికి కూడా అంగీకరించాలన్నారు. దీనిని ఎవరూ ప్రశ్నించడం లేదే అన్నారు. ఇలాంటి వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. అలాంటి పార్టీలు రాష్ట్రానికి అవసరం లేదన్నారు.