జగన్కు తీవ్ర మానసిక రుగ్మతలు ఉన్నాయ్: ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చినా వదులుకున్నా
Chandrababu Naidu: ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. సోమవారం రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.
ఈ సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రోడ్ షోల్లో పాల్గొంటోన్నారు.

ఈ పరిణామాల మధ్య చంద్రబాబు.. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ స్మిత ప్రకాష్ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ప్రొమోను ఏఎన్ఐ విడుదల చేసింది. పూర్తి ఎపిసోడ్ ఈ సాయంత్రం 5 గంటలకు టెలికాస్ట్ కానుంది.
వైఎస్ జగన్పై చంద్రబాబు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ ప్రోమోలో. జగన్ను సైకోగా, శాడిస్ట్గా, ఈగోయిస్ట్గా అభివర్ణించారు. ఆయనకు ఏవో తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆయన వ్యక్తిత్వం మొత్తం సైకోలాంటిదని ఆరోపించారు. ఆ శాడిజం, సైకో మనస్తత్వంతోనే తాను పునాదిరాయి వేసిన అమరావతిని రాజధానిగా చేయట్లేదని విమర్శించారు.

పది సంవత్సరాల తరువాత కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయిమయం అయిందని అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. చారిత్రకంగా, రాజకీయంగా, సాంస్కృతికపరంగా కొన్ని కులాలు, మతాలు వెనుకంజలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.
పీవీ నరసింహారావు తరువాత చంద్రబాబే దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అవుతారని అందరూ భావించారని, ఎందుకు ఆ పదవిని చేపట్టలేదంటూ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందించారు. ప్రధాని అయ్యే అవకాశం తనకు వచ్చిందని, జ్యోతిబసు, హరికిషన్ సింగ్ సుర్జీత్, కరుణానిధి వంటి నాయకులతో రాజకీయాలు చేశానని గుర్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications