కేసీఆర్! మీకేం ఇబ్బంది లేదు, నవీన్ పట్నాయక్ అడ్డుకోవద్దు: బాబు, జగన్పై ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేయవద్దని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నవీన్ పట్నాయక్ కూడా అడ్డుపడవద్దు
పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడవద్దని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు కూడా విజ్ఞప్తి చేశారు. పోలవరం వల్ల ఒడిశాకు ఐదు టీఎంసీల నీటి లభ్యత ఉంటుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అంతర్గతంగా ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీ అభివృద్ధి కోసం ముందుకు సాగుతానన్నారు.
వారేం మాట్లాడుకున్నారో తెలియదు
ఒడిశాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చర్చించారో తెలియదని చంద్రబాబు చెప్పారు. తెలంగాణకు పోలవరం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయినా అడ్డంకులను సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదని చెప్పారు. ఒక్కసారి ప్రాజెక్టు ఆగితే మళ్లీ అడుగు ముందుకు పడదని, నిధులివ్వాల్సిన కేంద్రం ఎందుకు అడ్డుకుంటోందన్నారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు ఆసక్తిగా పనులు చేయిస్తున్నారన్నారు.
జగన్కు ప్రజాప్రయోజనాలు కనిపించట్లేదు
ప్రధాని నరేంద్ర మోడీ, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖలు రాస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ ఉక్కు కర్మాగారం, రాజధాని అమరావతి నిర్మాణాలను రియల్ ఎస్టేట్ వ్యాపారమని జగన్ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్కు ప్రజా ప్రయోజనాల ఆయనకు కనిపించడంలేదన్నారు. నవీన్ పట్నాయక్తో తాను మాట్లాడతానని, ఆ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రయోజనకారి అన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టునూ ఇంత త్వరగా పూర్తి చేస్తున్న దాఖలాలు లేవన్నారు.
శీతకన్ను వేసింది
ఏపీలోని ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందని చంద్రబాబు అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన 2019 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులో ఇప్పటి వరకు 62.8 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ప్రాజెక్టులోని అన్ని డిజైన్లకు అనుమతులు వచ్చాయన్నారు.