ఆ 7మండలాల వల్లే పోలవరం ముందుకు: గడ్కరీ ఎక్కువే ఇచ్చారన్న చంద్రబాబు
విజయవాడ: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుండటం అభినందనీయమని ఏపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపికి కేటాయించడంలో కేంద్రమంత్రి వెంకయ్య కీలక పాత్ర పోషించారని అన్నారు.
ఆ ఏడు మండలాలు ఏపికి ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయి ఉండేదని అన్నారు. కేంద్రం సహకారం వల్లే పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగుతోందని అన్నారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేశామని, దీంతో 8లక్షల హెక్టార్లకు పైగా పంటలు సాగులోకి వచ్చాయని తెలిపారు.
60వేల కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిని చేపడ్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇవ్వడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు. మంచి రోడ్లుంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. వాజపేయి ప్రభుత్వంలోనే దేశంలో రహదారుల నిర్మాణం జరిగిందని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రహదారుల అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు.
దేశంలో అభివృద్ధి జరగాలన్నదే ప్రధాని మోడీ ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు. రోడ్ల అభివృద్ధికి 65వేల కోట్లు ప్రకటించిన గడ్కరీకి ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. దేశం మొత్తంలో 2.60లక్షల ఇళ్లు మంజూరైతే.. కేవలం ఏపికే 1.90లక్షల ఇళ్లు ఏపి సాధించడం జరిగిందని చెప్పారు.
ఏపిని దేశంలోనే మూడు పెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని అన్నారు. తాను అడిగినదానికంటే కేంద్రమంత్రి గడ్కరీ ఎక్కువగానే నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు 160కిలోమీటర్లుంటే.. ఏపి రాజధాని అమరావతి రింగ్ రోడ్డు 200కిలోమీటర్లతో నిర్మాణం జరగుతోందని అన్నారు. కృష్ణా పుష్కరాల్లోపు దుర్గా గుడి ఫ్లైఓవర్ను పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు.