ఐటీ వచ్చాక ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది: బెజవాడలో చంద్రబాబు
అమరావతి: ఐటీ రంగం వచ్చాక ప్రంపంచం కుగ్రామంగా మారిందని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 139 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన నగదు, ప్రోత్సాహక బహమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టేలా విద్యావిధానాన్ని అమలు చేస్తామని అన్నారు. నాలెడ్జిని పుస్తకరూపంలో రాస్తే అది థియరీ అవుతుందని చెప్పారు. ఉన్నత విద్యలో రాష్ట్రం ఐదో స్థానంలో ఉందని అన్నారు.
పాఠశాలలు ప్రయోగశాలగా మారాలని, ఇంటర్ డిగ్రీ కాలేజీలు ఇన్నోవేషన్ సెంటర్లుగా రూపాంతరం చెందాలని ఆయన సూచించారు. విద్యా సంస్థల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలని, పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు చంద్రబాబు సూచించారు.
రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఐటీ రంగంపై మరింత శ్రద్ధ పెడతామని, తద్వారా యువతకు మెరుగైన ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పుష్కరాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థరంగా వినియోగించుకోగలిగామన్నారు.
కొందరు విద్యార్థులు ఆశ్చర్యం కలిగించేలా వినూత్న ప్రయోగాలు చేస్తున్నారని.. వారిని ఇంకా ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రతిభ ఉన్న పేద విద్యార్ధులను ఉన్నత చదువులు చదివేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని ఆయన చెప్పారు.