బాబు తలుచుకుంటే అంతేనా!: ఆ కంపెనీకి అప్పుడే నిధులా?..
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కలల ప్రాజెక్టు పోలవరం విషయంలో అంతా గందరగోళమే. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలే తప్పించి.. నిజంగా అక్కడ ఏం జరుగుతోందన్న దానిపై క్లారిటీ లేదు. ఇక నిధుల సంగతి సరే సరి.. శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తే.. ఇంతకుముందే వెబ్సైట్లో పెట్టాం చూసుకోండి అని పొడిపొడి సమాధానాలు చెప్పేశారు. ఇక కొత్తగా పోలవరంలో కాంట్రాక్టు దక్కించుకున్న నవయుగ కంపెనీ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.

నవయుగ కంపెనీ పనులు..:
పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే, స్పిల్ ఛానల్ కాంక్రీటు మట్టి పనులు పాత కాంట్రాక్టరుతో పూర్తయ్యే అవకాశం లేదని భావించిన చంద్రబాబు సర్కార్.. ఆ పనులను నవయుగ కన్స్ట్రక్షన్స్కు అప్పగించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం అంచనా వ్యయం పెరిగిందని కేంద్రం ముందు ప్రతిపాదన పెడితే.. పాత ధరలకే పనులు చేయించే కాంట్రాక్టరును వెతకాలని అప్పట్లో ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు నవయుగ ముందుకు రావడంతో ఆ కంపెనీకే కాంట్రాక్టు దక్కింది.

ఆ పని పూర్తి కాకుండానే..:
తాజాగా ఇంజనీర్ల నివేదికలో పొందుపరిచిన ప్రకారం.. నవయుగకు కాంట్రాక్టు ఇచ్చారు కానీ పనుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పాత కాంట్రాక్టర్ నుంచి పనులను వేరు చేసి ఇవ్వడమనే ప్రక్రియ ఇంకా సాంకేతికంగా జరగలేదని చెబుతున్నారు.

అప్పుడే నిధులు..:
సాంకేతికంగా పనుల అప్పగింత పూర్తి కాకపోయినా.. అప్పుడే నవయుగ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందజేయడానికి కేబినెట్ నుంచి అనుమతినివ్వడం గమనార్హం.
గతంలోనూ ఎంపీ రాయపాటి కంపెనీకి పనులు మొదలుపెట్టకుండానే నిధులు మంజూరు చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు నవయుగ కంపెనీ విషయంలోనూ అదే జరుగుతుండటం ప్రభుత్వంపై విమర్శలకు తావిస్తోంది.

బాబు తలుచుకుంటే అంతేనా?:
పనుల విషయం పక్కనపెట్టి ముందే నిధులు మంజూరు చేస్తే సదరు కాంట్రాక్టర్ పనులు సకాలంలో పూర్తి చేస్తాడా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. దీంతో బాబు తలుచుకుంటే అంతే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దాంతో పాటు పాత కాంట్రాక్టర్ నుంచి న్యాయమరమైన చిక్కులు ఎదురవకుండా.. అవి పనులకు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి స్థాయి పనులు కూడా ఇంకా మొదలవలేదు. ఇవేవి జరగకుండానే నిధులు మంజూరుకు ఎందుకింత ఉత్సాహం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications