కేసీఆర్! ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నప్పుడు పక్కనే ఉన్నావ్, జగన్తో కలువ్: బాబు సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు 8వ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రూరల్, అర్బన్ డెవలప్మెంట్ పైన దీనిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడు తనపై చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
పరిపాలన గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు. తెలంగాణలో తాగునీటి కోసం 56వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అయినా నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదని ఎద్దేవా చేశారు. తన పైన కేసీఆర్ పూర్తిగా పద్ధతి లేకుండా మాట్లాడారని అన్నారు. ఆయన వాడిన భాష అసభ్యంగా, అసహ్యంగా ఉందన్నారు.
కేసీఆర్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదా
తనపై కేసీఆర్ నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. తాను ఎప్పుడు కూడా పద్ధతి లేని రాజకీయం చేయలేదని చెప్పారు. హుందాతనాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేదని చెప్పారు. తాము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్తో కేసీఆర్ పొత్తు పెట్టుకోలేదా అన్నారు. ఇప్పుడు తమకు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్తో కలిసి వెళ్తున్నామని అభిప్రాయపడ్డారు.
నన్ను బ్రహ్మాండంగా పొగిడారు, ఇష్యూలపై రాజీపడలేదు
కేసీఆర్ టీడీపీతో, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అవకాశవాదం కాదా అని చంద్రబాబు నిలదీశారు. ఏపీలో ఎన్నికల ప్రచారం చేసుకుంటే చేసుకోవచ్చునని, అందులో తప్పు లేదని చెప్పారు. 1996 నుంచి కేసీఆర్ తనతోనే ఉన్నారని, ఆ రోజు తనను బ్రహ్మాండంగా పొగిడారని చంద్రబాబు గుర్తు చేశారు. కేసీఆర్కు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హుందాతనం లేకుండా మాట్లాడారన్నారు. నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు హుందాతనం కోల్పోలేదని, అదే సమయంలో ఇష్యూలపై రాజీపడలేదన్నారు.
ఏపీలో ప్రచారం చేసుకో, జగన్తో పొత్తు పెట్టుకో, మాకేమిటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చునని చంద్రబాబు సూచించారు. అవసరమైతే నరేంద్ర మోడీ, కేసీఆర్ కలిసి పోటీ చేసుకోవచ్చునని, మాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు. అవసరమైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోండని, మాకు ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని చెప్పలేదా?
తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని చెప్పలేదా అన్నారు. కేసీఆర్ మెచ్యూరిటీ మోడీకి నచ్చిందని ఎద్దేవా చేశారు. ఇద్దరు ఎంపీలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని కలిపేస్తామని చెప్పి, తెలంగాణ తెచ్చుకున్నారని, ఆ తర్వాత మాట తప్పారని ఇది నచ్చిందా అన్నారు. మోడీ గాడు అని తిట్టినందుకు ఇష్టమా అన్నారు. హైటెక్ సిటీకి జనార్ధన్ రెడ్డి పునాదిరాయి వేశారని చెప్పారని, ఎప్పుడు వేశారని ప్రశ్నించారు. హైటెక్ సిటీ, విమానాశ్రయం, మైక్రోసాఫ్ట్.. ఇవన్నీ తన వల్ల వచ్చినవి కాదా అని ప్రశ్నించారు. 1995-2004 మధ్య హైదరాబాదులో మంచి పునాది వేశామన్నారు.2009లో పొత్తు వద్దని చెబితే కేసీఆర్ తన వద్దకు పరుగెత్తుకు వచ్చారని చెప్పారు. 40 సీట్లు ఇస్తే 10 సీట్లు మాత్రమే గెలిచారని చెప్పారు. నేదురుమల్లి హైటెక్ సిటీకు శంకుస్థాపన ఎప్పుడు చేశారో తెలియదన్నారు.
హరికృష్ణపై రాజకీయాలు చేశానా
హరికృష్ణ చనిపోయినప్పుడు నేనేదో రాజకీయాలు చేశానని చెబుతున్నారని, నేనేం రాజకీయాలు చేశానని చంద్రబాబు ప్రశ్నించారు. హరికృష్ణ చనిపోయినప్పుడు... అంతిమయాత్ర గురించి మాట్లాడానని చెప్పారు. అందులో తప్పేమిటన్నారు. ప్రత్యేక హోదాపై గతంలో కేసీఆర్ మాట్లాడారని, ఇప్పుడు లేఖ రాస్తానని చెబుతున్నారని, రాయాలని చెప్పారు. రెండు రాష్ట్రాల సమస్యలపై కేసీఆర్, కేంద్రం ఆలోచించలేదన్నారు.
ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నానా?
అలాగే, ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నానని కేసీఆర్ చెబుతున్నారని, కానీ అప్పుడు మీరు (కేసీఆర్) నా పక్కన లేరా అని గట్టి కౌంటర్ ఇచ్చారు. హరికృష్ణ మరణంపై నేను రాజకీయం చేయలేదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ లేఖ రాయాలన్నారు. ఏపీ ప్రజలను మోడీ సర్కార్ మోసం చేసినందునే కాంగ్రెస్తో జతకట్టామని చెప్పారు.
తెలంగాణలో ఏం చేశావ్
సమస్యలు పరిష్కరించుకొని ముందుకు సాగుదామని తాను కేసీఆర్కు చెప్పానని చంద్రబాబు చెప్పారు. రెండు రాష్ట్రాలు సహకారంతో ముందుకెళ్లాలంటే కేసీఆర్ ముందుకు రావడం లేదన్నారు. కానీ కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని అన్నారు. రైతులు రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చారని, అందులో సచివాలయం కట్టామని చెప్పారు. ఏపీలో మేం చేసిన పనులు కనిపిస్తున్నాయని, తెలంగాణలో కోట్లు ఖర్చు పెట్టారని, ఏం చేశారో చెప్పాలన్నారు.
నీ ఇంటికి రూ.300 కోట్లు, అమరావతికి రూ.1500కోట్లా?
కేసీఆర్ చాలా అంశాలను కాపీ కొట్టారని చంద్రబాబు చెప్పారు. కళ్యాణలక్ష్మిని కొట్టారని చెప్పారు. కేసీఆర్ ఇంటికి రూ.300 కోట్లు కావాలి కానీ మా రాజధానికి రూ.250 కోట్లు సరిపోతాయా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇస్తే ఎక్కువైందని కేసీఆర్ అనడం విడ్డూరమని చెప్పారు. రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా అన్నారు.