అవి సరైనవేనని రుజువైంది: కేంద్ర బడ్జెట్పై చంద్రబాబు, లేని రైల్వేజోన్ ప్రస్తావన
Recommended Video
హైదరాబాద్/అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు కేటీ రామారావు, కల్వకుంట్ల కవితలు వేర్వేరుగా స్పందించారు.
వేతన జీవులకు భారీ ఊరట: ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలు, ఏ శ్లాబ్కు ఎంత పన్ను అంటే?
ఏపీ ప్రస్తావన లేకపోవడం దారుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, విభజన సమస్యల పైన చివరి బడ్జెట్లోను కేంద్రం స్పందించలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రస్తావన లేకపోవడం దారుణం అని వాపోయారు. ఏపీలో ఆందోళనలు సరైనవేనని ఇప్పుడు మరోసారి రుజువయిందని చెప్పారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు.
చివరి బడ్జెట్లో ఏమైనా చేస్తారా అని చూస్తుంటే
చివరి బడ్జెట్లోనైనా ఏమైనా చేస్తారా అని చూస్తే ఏమీ ప్రకటించలేదని చంద్రబాబు మండిపడ్డారు. బీజేపీ నేతలకు ఏపీ కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇండియా మ్యాప్ నుంచి ఏపీని తీసేస్తారేమోనని వాపోయారు. నేటి అన్యాయానికి పూర్తిస్థాయిలో బీజేపీదే బాధ్యత అన్నారు. వైసీపీతో అంటకాగి అన్యాయం చేయాలనుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి సహకరించేవాళ్లతోనే తాము కలుస్తామని, తెలుగువాళ్ల కోసమే ముప్పై ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్తో చేతులు కలిపామన్నారు.
రైల్వే జోన్ ప్రస్తావన
కాగా, ఈ బడ్జెట్లో ఏపీకి సంబంధించిన విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావన లేదు. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీకి కూడా కేటాయింపుల గురించి చెప్పలేదు. కేంద్ర బడ్జెట్లో రైతులకు, ఉద్యోగులకు, పింఛన్దారులకు భారీ ఊరట కల్పించారు. కానీ రాష్ట్రాలవారీగా చూస్తే ఏపీకి సరైన న్యాయం జరగలేదని అంటున్నారు.