ఇస్రో నుండి హుధుద్ పిక్చర్స్: బాబు, టెక్నాలజీతో..
హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా మనం విఫలం కావడానికి వీలు లేదని, ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకూడదని, మనుషులకే కాదు జంతువులకు సైతం ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హుధుద్ తుఫాను తీవ్రతపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్రతోపాటు తూర్పు గోదావరి జిల్లా మీద తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ఆయా జిల్లాల అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. శనివారం సచివాలయం నుంచి హుధుద్ తీవ్రతపై ఆయన ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు.
తుపాను గమనం, వేగంతో పాటు ఎప్పుడు ఎక్కడ తీరందాటే అవకాశం ఉందన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆన్లైన్లో కూడా అధికారులు సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. వాతావరణ శాఖతోపాటు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి కూడా తుపాను గమనానికి సంబంధించి ఉపగ్రహ చిత్రాలను తెప్పించి విశ్లేషిస్తున్నట్లు చెప్పారు.
జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాలవాగా సహాయ బృందాలను మోహరించాలన్నారు. కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ అనంతరం చంద్రబాబు లేక్వ్యూ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
తుపాను కదలికలను తెలుసుకునేందుకు ఇస్రో సహకారంతో స్పేస్ టెక్నాలజీని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. క్లౌడ్ సోర్సింగ్ విధానంలో వాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ప్రజలకు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేస్తున్నామని, ఇందుకు ఇస్రో సహకారం తీసుకుంటున్నామని బాబు తెలిపారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో మంత్రి నారాయణను విశాఖ వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు.
హుధుద్ తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిసాల్లో సహాయ, పునరావాస చర్యలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఏపీ, ఒడిసా సీఎంలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించాలని హోం మంత్రి రాజ్నాథ్ను ఆదేశించారు. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు అధికారులు ప్రధానికి వివరించారు.