చంద్రబాబును పొగిడారా? తెలుగుదేశాన్ని తిట్టారా?: జగన్పై జేసీ సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనంగానో.. ఆసక్తికరంగానో ఉంటాయి. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారాయన. అవేమంటే.. ప్రజల ఆశయాలు నెరవేరాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడునే ము
అనంతపురం: తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనంగానో.. ఆసక్తికరంగానో ఉంటాయి. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేశారాయన. అవేమంటే.. ప్రజల ఆశయాలు నెరవేరాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లాలో నీరు-ప్రగతి ఉద్యం ప్రారంభం సందర్భంగా పామిడిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. నీటి విషయంలో సీఎం కృషి అభినందనీయమని జేసీ అన్నారు. పోలవరంపై ప్రజలు కలలు కన్నారని.. చంద్రబాబు నాయుడు కష్టపడి పోలవరాన్ని సాధించారన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడని ఆయన విమర్శించారు. మంత్రి పదవి కోసం తాను పార్టీలో చేరలేదని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో, దేశంలో ప్రతి ఒక్కరికీ కులాభిమానం ఉంటుందని, లేదని ఎవరైనా చెబితే, వారు అబద్ధం చెప్పినట్టేనని, తనకూ కులాభిమానం ఉందని అన్నారు.
'నాకూ జగన్ పక్కన పోవాలనే ఉంది. ఏం చేస్తారు మరి జగన్? ఏమీ చేయడు. వాడు వెధవ. ఐయాం సారీ. వెధవ అనడం కూడా తప్పేమో. వద్దు వెధవ అనే మాట ఉపసంహరించుకుంటున్నా. ఏమీ చేయలేడు. కాంగ్రెస్ పార్టీ కుళ్లిపోయింది.. ఆ వాసన భరించలేకే.. విధిలేని పరిస్థితుల్లో నేనీ తెలుగుదేశం పార్టీలో చేరాను' అని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'ఇప్పుడు చెబుతున్నా ఒకవేళ ఎవరికి ఏదున్నా... ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, ఇవాళ ఉన్న లీడర్స్ లో హీ ఈజ్ ది మ్యాన్. ఈయన(చంద్రబాబు) ఒక్కడికే ఆ యోగ్యత, శక్తి ఉంది. అందువల్లే తెలుగుదేశంలో చేరాను తప్ప. ఈయనేదో మంత్రి పదవి ఇస్తాడని నాకెప్పుడూ లేదు' అని జేసీ స్పష్టం చేశారు.
ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారో తెలియదుగానీ, రాష్ట్రానికి చంద్రబాబు మంచి చేస్తున్నారని కితాబిచ్చారు. నీళ్ల విషయం అడిగితే 'యస్' అంటారని చెప్పారు. చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేస్తే, నిజంగా అనంత జిల్లా సస్యశ్యామలం అవుతుందని, అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. అప్పో సప్పో చేసి, బంగపోయో, బతిమాలో ఈ పనులను జరిపించాలని, ఈ పనులు ఇప్పుడు కంప్లీట్ అవుతాయన్న నమ్మకం తనకు లేదని, మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, అప్పటికి నీరు వస్తుందని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
కాగా, గురువారం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా అనంతపురంలో జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గురువారం ఉదయమే అనంతపురం జిల్లాకు చేరుకున్న చంద్రబాబు.. పామిడిలో పంటల కుంటల నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం పామిడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీరు-ప్రగతి పైలాన్ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications