అమరావతి వెళ్లాక మార్పు: కెసిఆర్ను పల్లెత్తు మాట అనని బాబు, హైద్రాబాద్లోనే ఉండలేని
హైదరాబాద్: పరిపాలనను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు మార్చిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా మారినట్లు కనిపిస్తోందని అంటున్నారు. శనివారం తెలంగాణ టిడిపి సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో చంద్రబాబు తెలంగాణ సిఎం కెసిఆర్ పైన విమర్శలు చేయలేదు. గతంలో కెసిఆర్ను టార్గెట్ చేసేవారు. ఇప్పుడు తెలంగాణ సీఎంను మాత్రం పల్లెత్తు మాట అనలేదని చెబుతున్నారు. కేవలం తెలంగాణలో టిడిపి బలోపేతం గురించే మాట్లాడారు.
తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాలుగా ఏపీ, తెలంగాణ పరస్పరం సహకరించుకోవాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సర్కారుతో దోస్తీ చేయక తప్పదని హితబోధ చేశారు.

అదే సమయంలో తెలంగాణలో విపక్ష స్థానంలో ఉన్న టీ టీడీపీ అధికార పార్టీ టీఆర్ఎస్ పై పోరు బాట సాగించాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ టీడీపీ కమిటీలో మార్పు చేర్పులకు సంబంధించి ఆ శాఖ నేతలకు పూర్తి స్థాయి అధికారం ఇస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో టీఆర్ఎస్ తెలంగాణలో అధికారం చేపట్టగా, ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తెలంగాణలో టీడీపీ ప్రతిపక్ష స్థానంలో అధికార పార్టీతో సిగపట్లకు దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో ప్రత్యక్షంగా విమర్శలు చేశారు.
వాటిని తిప్పి కొట్టే క్రమంలో టీడీపీ కూడా ఘాటు వ్యాఖ్యలకు దిగాల్సి వచ్చింది. కొద్ది నెలల క్రితం ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్లు ఇరు పార్టీల మధ్యే కాక రెండు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చాయి. అయితే, రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో చంద్రబాబు, కేసీఆర్ల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంది.
ఇకపై తగవులాడుకోవడం ఇరు రాష్ట్రాలకు నష్టమేనని వారిద్దరూ దాదాపుగా ఓ అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న టీడీపీ వ్యూహం ఎలా ఉండాలనే అంశంపై ఆ శాఖ నేతలు డోలాయమానంలో పడిపోయారు. నేతల్లోని అయోమయాన్ని తొలగిస్తూ చంద్రబాబు వారికి శనివారం సూచనలు చేశారు.
ప్రజల సమస్యల పైన పోరాడాలని, తద్వారా చొచ్చుకు పోవాలని చెప్పారు. తెలంగాణ టిడిపి పని తీరు బాగుందని కితాబిచ్చారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పారు. తెలుగు వారు ఎక్కడున్నా వారి కోసం టిడిపి పోరాడుతుందన్నారు.
విభజన జరిగిన తర్వాత రెండు ప్రభుత్వాలు చీటికి మాటికి గొడవ పడకుండా సమన్వయంతో పని చేసుకుంటే మంచిదని తాను చాలాసార్లు చెప్పానని, విభజన త్రవాత ఏర్పడిన కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు.
హైదరాబాదులో నిజమైన ఓటర్లను తొలగించినప్పుడు.. టిడిపి నేతలు పోరాడితే ఎన్నికల కమిషన్ దిగి వచ్చిందన్నారు. ఇంకా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టిడిపి నేతలు కోరినట్లుగా తాను ఇక్కడ (హైదరాబాద్) ఎక్కువ కాలం ఉండలేనని, పాలన దృష్ట్యా అమరావతి వెళ్లవలసి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications