అమ్మో! అంతనా: చంద్రబాబు టార్గెట్పై యనమల, 'ఏపీకి చాలా సిమెంట్ కావాలి'
హైదరాబాద్: ఏపీ జీడీపీ వృద్ధి పైన ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎదుట ఓ సందేహాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పదిహేను శాతం వృద్ధి రేటును చేరేలా చూడాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు.
దీంతో, అంత వృద్ధి రేటు సాధించడం సాధ్యమా అని మంత్రి యనమల ప్రశ్నించారని తెలుస్తోంది. జీడీపీ విషయమై ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని తెలుస్తోంది. వృద్ధి లక్ష్యం మరీ ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీన్ని అందుకోవడం సులువుకాదని యనమల అభిప్రాయపడ్డారు.
ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకుని దాని కోసం పనిచేస్తే మంచిదేనని చంద్రబాబు... యనమలకు సూచించారని తెలుస్తోంది. వృద్ధి రేటును సాధ్యమైనంత పైకి తీసుకువెళ్లాలన్నదే తన అభిమతమని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
సిమెంట్ కంపెనీలకు చంద్రబాబు
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రోడ్లు వెడల్పు, ఆధునికీకరణ తదితరాల నేపథ్యంలో ఏపీకీ పెద్ద ఎత్తున సిమెంట్ అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సిమెంట్ కంపెనీలకు ఓ సూచన చేశారు. సిమెంట్ కంపెనీలు సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.
సమాచారం మేరకు 5.26 లక్షళ ఇళ్ల నిర్మాణం కోసం దాదాపు 35,97,869 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం పడుతుందని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు శనివారం నాడు పలువురు సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.