ఏడాది కుర్చీ ఇస్తే పరిష్కరిస్తా: తెలంగాణపై బాబు
న్యూఢిల్లీ: తనకు ఏడాది పాటు అధికార పీఠం ఇస్తే రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కరణ్ థాపర్ డెవిల్స్ అడ్వొకేట్ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేయాలని అడగడం లేదంటూనే సమస్యలను దేశ ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లడానికి దీక్ష చేపట్టినట్లు చెప్పారు.
మంత్రుల బృందం ఏర్పాటుపై ప్రశ్నించినప్పుడు తీర్పు చెప్పి వాదనలు వినిపించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని తప్పు పట్టారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నీరు, విద్య, ఉద్యోగాలు, హైదరాబాద్, రెవెన్యూ పంపకాలపై అనుమానాలతో సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేస్తోందని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెసు పార్టీలతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు అన్నప్పుడు అది నిజమే కానీ.. మీరు ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నారని అడిగితే స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయారు. సమన్యాయం చేయాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. ఆ సమన్యాయం ఎలా ఉండాలంటే ఆయన నిర్దిష్టంగా చెప్పలేదు. కాంగ్రెసు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనను చేపడుతుందని అంటున్న మీరు కూడా దానికోసమే దీక్ష చేస్తున్నారు కదా అంటే తాను అలా కాదని చంద్రబాబు అన్నారు.
తాను తన ప్రాణాలను, ఆరోగ్యాన్ని లెక్కచేయనని, భగవంతుడు కోరుకున్నదాకా దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. సీమాంధ్రలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు ప్రాధాన్యాన్ని కోల్పోయాయని, ఇరువైపులా ఉన్న జెఎసిలను పిలిచి కేంద్రం మాట్లాడాలని చంద్రబాబు అన్నారు. మీరు పొట్టి శ్రీరాములు మాదిరిగా అమరులు కావాలని అనుకుంటున్నారా అని అడిగితే అలా అనుకోవడం లేదని చెప్పారు. తాను కాంగ్రెసు దుష్టనీతిని ఎండగట్టడానికి మాత్రమే దీక్ష చేస్తున్నానని చెప్పారు.