లొంగదీసుకోలేరు, చర్యలు తప్పవు: శివప్రసాద్కు బాబు హెచ్చరిక, కారణం అదేనా?
తనపై, తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సొంత పార్టీ పార్లమెంటుసభ్యుడు శివప్రసాద్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం ఆయన పార్టీ ముఖ్య నేతలు
అమరావతి: తనపై, తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సొంత పార్టీ పార్లమెంటుసభ్యుడు శివప్రసాద్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం ఆయన పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణ, తాజా పరిణామాలపై చర్చించారు.
ఇంత మోసం చేస్తారా?: చంద్రబాబుపై టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిప్పులు
ఈ సందర్భంగా పలువురు నేతలు ఎంపీ శివప్రసాద్ విమర్శలను ప్రస్తావించారు. కొంతకాలంగా అసంతృప్తితో ఉంటున్న శివప్రసాద్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. అంతేగాక, భూ వ్యవహారమే శివప్రసాద్ వ్యవహారానికి కారణమని అన్నారు. కావాలనే శివప్రసాద్.. సీఎం, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
చంద్రబాబుపై శివప్రసాద్ నిప్పులు: తెర వెనక జరిగిన కథ ఇది! టీడీపీలో కలవరం
చంద్రబాబు ఆరా
ఈ క్రమంలో చంద్రబాబు.. ఎంపీ శివప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేగాక, ‘శివప్రసాద్ ఎందుకలా అన్నారు.. ఏం జరిగింది?' అని చిత్తూరు జిల్లా మంత్రి అయిన అమర్నాథ్ రెడ్డిని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
భూమి కేటాయించలేదనే..
‘దళితులకు హాథీరాంజీ మఠం భూములు ఇవ్వాలని సిఫారసు లేఖ ఇచ్చారు. కానీ భూముల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో అధికారులు తిరస్కరించారు. అందుకే అలా మాట్లాడి ఉంటాడు' అని అమర్నాథ్ రెడ్డి సీఎంకు వివరించారు.
శివప్రసాద్కు హెచ్చరిక
దళితులకు ఏ ప్రభుత్వమూ చేయనంతగా మన ప్రభుత్వం చేస్తోందని సీఎం ఈ సందర్భంగా మంత్రులతో పునరుద్ఘాటించారు. శివప్రసాద్ వ్యక్తిగత అజెండాతోనే అలా మాట్లాడి ఉంటారని మంత్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అజెండాతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
లొంగదీసుకోలేరు..
తాము దళితులకు ఏం మేలు చేశామో ప్రజలకు తెలుసునని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితులను లోకసభ, అసెంబ్లీ స్పీకర్లుగా చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టి నన్ను లొంగదీసుకోవడం సాధ్యం కాదని ఈ సందర్భంగా శివప్రసాద్ ను ఉద్దేశించి హెచ్చరించారు చంద్రబాబు.
శివప్రసాద్ మరో తలనొప్పే
సాధారణంగా ఏ నేతైనా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తే.. చంద్రబాబు వారిని తన వద్దకు పిలిపించుకుని మాట్లాడతారు. కానీ శివప్రసాద్ విషయంలో ఇది జరగలేదు. అయితే, బహిరంగంగా తనపై, తన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంప ట్ల శివప్రసాద్పై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే మంత్రి పదవి నుంచి తొలగించడంతో పార్టీకి దూరంగా ఉంటున్న సీనియర్ నేత బొజ్జల కృష్ణారెడ్డికి తోడు తాజాగా శివప్రసాద్ చేరడంతో టీడీపీకి కొంత తలనొప్పి ఎక్కువైందనే చెప్పాలి.
విమర్శల దాడి ఇలా..
‘ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ను పరిగణనలోకి తీసుకుంటే కనీసం ఐదు మంత్రి పదవులు దళితులకు ఇవ్వాలి. అయితే ఇద్దరికే అవకాశమిచ్చారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులూ ఓసీలకే కట్టబెట్టారు. పరిశ్రమల పేరిట పేదల భూములన్నీ ప్రభుత్వం లాగేసుకుంటోంది. దళిత ప్రజాప్రతినిధులకు సమాచారం కూడా ఇవ్వకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దళితులను ఈ ప్రభుత్వం మోసగిస్తూనే ఉంది' అంటూ అంబేద్కర్ జయంతి సభలో ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.