ఎపికి హోదా కావాలని చంద్రబాబు అసలు అడగలేదా?
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరిపై తెలుగుదేశసం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు సంచలన ప్రకటన చేశారు. చెన్నైలో మీడియాతో ఆయన అసలు విషయం చెప్పేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఏ రోజు కూడా అడగలేదని ఆయన చెప్పారు. విభజన జరిగినప్పుడు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని మాత్రమే చంద్రబాబు డిమాండ్ చేసినట్లు, నేడు 2.25 లక్షల కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పినట్లు ఆయనయ తెలిపారు. మరి అన్ని కోట్ల రూపాయలు ఇస్తే చంద్రబాబు ఏం చేసినట్లు అనే అనుమానం జనాలకు కలుగుతోందని ఆయన అన్నారు.

అసలు ప్రత్యేక హోదా అనేది కేవలం బిజెపికి సంబంధించిన విషయం మాత్రమేనని, విభజన సమయంలో వెంకయ్య నాయుడు హోదా ప్రస్తావన తేకుంటే ఎవరికీ ఆ విషయం తెలిసేది కాదని, ఎవరూ అడిగే వారు కాదని ఆయన అన్నారు. నాటి ప్రధాని ఐదేళ్లు హోదా ఇస్తామంటే వెంకయ్య, జైట్లీ మాత్రం పదేళ్లు అడిగారని ఆయన గుర్తు చేశారు.
ఎపి ప్రజలు దిక్కు లేకుండా చెట్టు కింద ఉన్నారని, ఆదుకునే వాళ్లను ఎందుకు వద్దనాలని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే ప్రయోజనం లేదని కేంద్రం అంటోందని, లాభం లేనప్పుడు ఇస్తే ఏం నష్టం వస్తుందని అన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications