Ycpని పద్మవ్యూహంలో బంధించిన చంద్రబాబు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాలుగా నాయకులు నిత్యం ఒకరిపై మరొకరు కాలు దువ్వుకుంటున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. ఒక్కోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేనవైపు మళ్లించేలా వ్యహాన్ని రచించి తెలివిగా అమలు చేశారు. ఆయన ఆశించినట్లుగానే ముఖ్యమంత్రి కానీ, ఇతర మంత్రులుకానీ పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

పవన్ భుజాలపై తుపాకీ పెట్టిన బాబు
సాధారణంగా టీడీపీ-వైసీపీ మధ్య ఉండాల్సిన వైరాన్ని వైసీపీ-జనసేన వైపుకు బాబు మళ్లించారు. పవన్ కల్యాణ్ భుజాలమీదగా జగన్ వైపు చంద్రబాబు తుపాకీని గురిపెట్టారు. రాజకీయ వ్యూహాల్లో చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు వ్యూహంలో వైసీపీ ఇరుక్కుపోయింది. టీడీపీ-వైసీపీ మధ్య యుద్ధం నడుస్తున్నప్పుడు ఎదురుదాడి చేయడంలో వైసీపీదే పై చేయిగా ఉండేది. చంద్రబాబు మాట్లాడినప్పటికీ ఆ పార్టీలోని ఇతర నేతల నుంచి అనుకున్నస్థాయిలో పదునైన విమర్శలు వచ్చేవికావు. కొందరు చంద్రబాబు మాటను పెడచెవిన పెడుతుండేవారు.

కౌంటర్లు ఇస్తున్న జనసేన
ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు రాజకీయంగా తాను చేసే విమర్శలను తగ్గించుకోవడంతోపాటు ఆ బాధ్యతను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అప్పగించారని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీని లక్ష్యంగా ఎంచుకోవడం, ముఖ్యమంత్రిపై విమర్శలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు కౌంటర్లు ఇవ్వడంలాంటివన్నీ జనసేన చేస్తోంది. పవన్ పలు అంశాల్లో మంత్రులను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించడమే దీనికి ఉదాహరణ.

ఆచి తూచి స్పందిస్తున్న వైసీపీ
జనసేన గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంకానీ, పరిపాలన చేయడంకానీ లేకపోవడంతోపాటు అసెంబ్లీలో అడుగు పెట్టింది కూడా లేదు. గత ఎన్నికల్లో గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. వీటివల్ల వైసీపీ నుంచి జనసేనపై పూర్తిస్థాయిలో టార్గెట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. మరీ తీవ్రమైన స్థితిలో వ్యక్తిగతంగా జనసేనను లక్ష్యంగా చేయలేని పరిస్థితిన ఎదుర్కొంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాపు సామాజికవర్గంతోపాటు పవన్ కల్యాణ్ అభిమానులుగా ఉండే యువత వైసీపీ ఓటర్లుగా ఉన్నారు. వ్యక్తిగతంగా దాడిచేస్తే వారిని కోల్పోవాల్సి వస్తుందనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది.












Click it and Unblock the Notifications