ఏపిలో మలేషియా తరహా పాలన: రెండంకెల వృద్ధి, 2016లో మళ్లీ జన్మభూమి
హైదరాబాద్: రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు మలేషియా తరహాలో పాలన కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రణాళికలు వేస్తున్నారు. శనివారం దాదాపు మూడు నెలల తర్వాత ఏపి సచివాలయానికి వచ్చిన చంద్రబాబు.. మంత్రులు, శాఖాధిపతులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అందుకు అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాల్సి ఉందని, అందులో భాగంగా మలేషియా ల్యాబ్ ఎక్సర్సైజ్ను అనుసరించాలని చెప్పారు.
ఆరెంజ్, గ్రీన్ కలర్స్ పెట్టుకుని ప్రతి మూడు నెలలకోసారి ప్రగతిని సమీక్షించే ఈ విధానం మలేషియాలో సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో కూడా మలేషియా తరహాలో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కాగా, రాష్ట్రంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో వృధ్ది రేటు 7.48 శాతంగా నమోదైందని, 2015-16లో 10.83 లక్ష్యంగా నిర్ధేశించినట్టు చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానం, ప్రాజెక్టులు, నీరు-చెట్టు, భూ గర్భ జలాల సంరక్షణ వంటి అంశాలపై మాట్లాడారు.
నెల్లూరులో జరిగిన విచ్చలవిడి కట్టడాల వల్లే ఇటీవలి కాలంలో ఆ పట్టణంలో వరద బీభత్సం సృష్టించిందని చెప్పారు. అనంతపురం జిల్లాలో ఈసారి ఊహించని విధంగా వర్షపాతం పెరిగిందని అన్నారు. భూ గర్బ జలాలు అందక రాయలసీమ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేదని, 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భూగర్భ జలాలు పెరిగాయన్నారు.
3 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 150 దేవాలయాల పని తీరును ఆయన ప్రశంసించారు. గృహ నిర్మాణ శాఖ, దేవదాయ శాఖ మంత్రుల పనితీరు బాగుందని అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో పర్యాటకుల ముఖ్యంగా విదేశీ పర్యాటకులు సంఖ్య పెరిగిందని చెప్పారు.
2016 నుంచి మళ్లీ జన్మభూమి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలో ఎంతో విజయవంతమైన జన్మభూమి కార్యక్రమాన్ని మరోసారి అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. 2016 జనవరిలో జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చంద్రద్రబాబు వెల్లడించారు.
ఈ-గవర్నెన్స్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్-1గా నిలబెడతామని పేర్కొన్నారు. 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమం సామాన్యులకు ఎంతో ప్రయోజనకారి' అని సిఎం చంద్రబాబు తెలిపారు.












Click it and Unblock the Notifications