కుప్పంలో చంద్రబాబు ఎంట్రీ..పెద్దిరెడ్డి అలర్ట్-కంచుకోటల్లో నయా రాజకీయం
టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పం. కానీ, ఇప్పుడు కుప్పం కోటపైన వైసీపీ గురి పెట్టింది. తాజాగా జరిగిన పంచాయితీ - మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు జలక్ ఇచ్చింది. దీంతో.. చంద్రబాబు సైతం అలర్ట్ అయ్యారు. కుప్పంలో వైసీపీ ఏ స్థాయిలో ఫోకస్ చేసిందీ స్వయంగా..ఆయనే పార్టీ నేతలకు వివరించారు. దీంతో.. కుప్పం ఇప్పుడు చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. చంద్రబాబును కుప్పం లోనే దెబ్బ తీయాలని సీఎం జగన్.. మంత్రి పెద్దిరెడ్డి భారీ వ్యూహమే అమలు చేస్తున్నారు.
2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు
ఈ ఏడాది తమకు రాజకీయంగా కీలకమని చెబుతున్న చంద్రబాబు కుప్పం నుంచే పార్టీ కేడర్ కు ధైర్యం చెబుతూ.. జోష్ నింపే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా నేటి నుంచి కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దేవరాజపురం చేరుకుంటారు. అక్కడి నుంచి రామకుప్పం మండలం ఆరిమానుపెంట, వీర్నమల, గట్టూరు, ననియాల, నారాయణపురం తాండ, సింగసముద్రం కెంచనబల్ల గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ఆరిమానుపెంటలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఎనిమిది గంటలకు కుప్పం చేరుకుని, రోడ్లు, భవనాల శాఖ అతిధి గృహంలో బస చేస్తారు. నియోజవకర్గ పరిధిలో పార్టీ సమావేశాలు.. రోడ్ షోలు నిర్వహిస్తారు.
కుప్పంలో టీడీపీ అధినేత అలర్ట్
కుప్పం గురించి తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కుప్పం నియోజకవర్గం తెదేపాకు కంచుకోట. అక్కడి ప్రజలు నన్నెంతో అభిమానిస్తారు. అలాంటి చోటా వైకాపా నాయకులు వారి అరాచకాలతో పార్టీని ఇబ్బంది పెట్టారు. కుప్పంలోనే అలా ఉంటే... మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండని పేర్కొన్నారు. తనను కుప్పంలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్న జిల్లా మంత్రి పెద్దిరెడ్డి పైన చంద్రబాబు ఫోకస్ పెట్టారు. తన నియోజకవర్గంలో పెద్దిరెడ్డి జోక్యం చేసుకోకుండా ఉండాలంటే.. పుంగనూరులో పెద్దిరరెడ్డికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ గతంలో కుప్పం పర్యటనలో హెచ్చరించారు.
పెద్దిరెడ్డి ముందస్తు వ్యూహం
కుప్పం పైన ఫోకస్ కొనసాగిస్తూనే...మంత్రి పెద్దిరెడ్డి తన సొంత నియోజవకర్గంలోనూ కీలకంగా అడుగులు వేస్తున్నారు. కుప్పం లో ఈ సారి పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇందు కోసమే ఇప్పటికే అక్కడ ఇన్ ఛార్జ్ గా ఉన్న గతంలో పోటీ చేసి అనారోగ్యంతో మరణించిన చంద్రమౌళి కుమారుడు భరత్ కు ఎమ్మెల్సీ ఇచ్చి..సుధీర్ రెడ్డి లైన్ క్లియర్ చేసారు. ఇక, ముందస్తుగానే పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట పట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు గ్రామల్లో పర్యటించారు. పథకాల నిర్వహణ పైన ఆరా తీసారు. ఇల్లు కోసం అర్జీలు..భూ వివాదాల పైన పెద్ద ఎత్తున ఆయనకు ఫిర్యాదులు వచ్చాయి.
Recommended Video
కుప్పం నుంచే ఆరంభం
రాజకీయంగా టీడీపీ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు నుంచే పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇక, వచ్చే ఎన్నికలు ఆషామాషీ కాదని చెబుతున్న చంద్రబాబు.. ప్రతీ నియోజవకర్గం పైన ప్రత్యేకంగా దిశా నిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవాలంటే ఢీ అంటే ఢీ అనే వారే అభ్యర్ధులుగా ఉండాలని ఇప్పటికే తేల్చి చెప్పేసారు. దీంతో..రానున్న రోజుల్లో అధికారం నిలుపుకొనేందుకు జగన్... అధికారం దక్కించుకొనేందుకు చంద్రబాబు వ్యహ - ప్రతి వ్యూహాలతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తి రంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. కుప్పంలో చోటు చేసుకొనే పరిణామాలు ఉత్కంఠను పెంచుతున్నాయి.