ముఖ్యమంత్రులం మాట్లాడుకోవాలి: చంద్రబాబు
కర్నూలు: విభేదాల కారణంగా రెండు రాష్ట్రాల ప్రజలు నష్టపోతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కర్నూలు జిల్లాలోని హుస్సేనాపురంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివాదాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదని చంద్రబాబు సూచించారు.
ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులం కూర్చుని వివాదాలపై మాట్లాడుకోవాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని అన్నారు. తెలుగుజాతికి మంచి జరగాలనేది తన ఉద్దేశమని అన్నారు. ప్రతీ రోజు వివాదాలు చేసుకోవడం రెండు రాష్ట్రాలకు మంచిది కాదని అన్నారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని అన్నారు.
కార్మిక శాఖ నిధులను సైతం వివాదం చేస్తున్నారని, తెలంగాణ నిధులు అక్కడే ఉన్నాయని, ఏపి నిధులు మాత్రమే బదిలీ చేశామని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కృష్ణా బోర్డ్ ఛైర్మన్ను విమర్శించడం బాధనిపిస్తోందని చంద్రబాబు అన్నారు.
శ్రీశైలం ఎడమ కాలువ నీటిని రాయలసీమకు తాగు, సాగునీటికి అందించడం మా ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ముఠా రాజకీయాల వల్లే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందడం లేదని అన్నారు. ముఠా రాజకీయాలతో కొందరు రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
స్వచ్ఛ భారత్లో ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తయారు చేసుకోవాలని అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరని చంద్రబాబునాయుడు అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో బహిర్భూమికి వెళ్లడం వల్ల అనేక వ్యాధులు వ్యాపిస్తాయని చెప్పారు.
ఉల్లి మద్దతు ధరకు అమ్మడవకపోయినా, ధర తగ్గినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. కర్నూలు జిల్లాలో సహజ వనరులున్నాయని, వాటిని ఉపయోగించి జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. రైతులకు మంచి విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు.