వారంలో ఒకరోజు చంద్రబాబు, ఫస్ట్ అంతస్తు తెలంగాణకే
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు, ఈ రాష్ట్ర సమస్యల పైన పోరాడేందుకు వారంలో ఒకరోజు కేటాయిస్తానని టిడిపి అధ్యక్షులు, కాబోయే ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మొదటి అంతస్తును తెలంగాణ రాష్ట్రానికి కేటాయించనున్నట్లు చెప్పారు. ఆ అంతస్తును ఆయన పరిశీలించారు.
రెండో అంతస్తును పార్టీ జాతీయ కార్యాలయంగా ఉంచనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యాలయాన్ని సీమాంధ్రలో కొత్తగా నిర్మించనున్నారు. లేదంటే ఇప్పటికే ఉన్న కార్యాలయాల్లో ఒకదానిని ఉపయోగించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ల లాంటివని చంద్రబాబు చెప్పారు. తెలుగు జాతిని కలిపి రుణం తీర్చుకుంటామన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని, అన్నదమ్ముల మధ్య విభజన జరిగిందని, తెలుగుజాతి మధ్య విబేధాలు, విద్వేషాలు ఉండడానికి వీల్లేదని, తెలంగాణలో కరెంట్, సాగునీరు, ఉద్యోగాలు తదితర సమస్యలు ఉన్నాయని, తెలంగాణలో తాము ప్రతిపక్షంలో ఉన్నామని, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని కేంద్రంలో మోడీ సహకారంతో తెలంగాణ ప్రాంతానికి నిధులు తీసుకు వస్తామని, ఇరు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడి ప్రజల రుణం తీర్చుకుంటామని చంద్రబాబు అన్నారు.
తెలంగాణ విజయం కొందరిది కాదని, ప్రజలందరూ కృషి చేయడం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని చెప్పారు. తెలంగాణ పోరాటంలో అమర వీరుల త్యాగాలను మరిచిపోవద్దని, వారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం, ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. కాగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు అమరవీరులకు నివాళులు అర్పించారు.