బాబు ఫోన్ ట్యాపింగ్లపై దర్యాప్తు, కారణం అదే..?
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన చుట్టూ ఉండేవారు, ఆయన సన్నిహితులు, ముఖ్య అధికారులు, కొందరు రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్లపై దర్యాప్తు జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేత సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఈ విషయమై విలేకరులతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ సభ్యులను కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం కుట్రలుమాని పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని అంతం చేసేందుకు గాను కొన్ని పత్రికలు, ఛానళ్లు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు.
ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీల ఎన్నికల నేపథ్యంలో నోటుకు ఓటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టయిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇతరులతో మాట్లాడిన సంభాషణల వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించడంతో పెద్ద దుమారం చెలరేగింది.

టీఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశంతోనే తెలంగాణ పోలీసులు ఈ పని చేస్తున్నారని నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు దీనిపై అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పటికే తమ దృష్టికి వచ్చిన అంశాలపై వారు ఒక సంక్షిప్త నివేదికను ఏపీ సర్కారుకు అందించినట్లు ప్రచారం జరుగుతోంది.
శనివారం హైదరాబాద్లో కొందరు ఉన్నతాధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వారి ఫోన్లను మరో రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేయించడం, అదికూడా ఉమ్మడి రాజధానిలో జరగడం అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించారు. దీనిని ఇలాగే వదిలేయకూడదని నిర్ణయించారు.
దీంతో ఫోన్ల ట్యాపింగ్పై తెలంగాణ ప్రభుత్వంపై నేరుగా క్రిమినల్ కేసు నమోదు చేయడం లేదా ఈ పరిస్థితిపై కేంద్రానికి వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఫోన్ల ట్యాపింగ్పై ఉన్నతాధికారి మాట్లాడుతూ ఉమ్మడి రాజధానిలో పోలీస్ యంత్రాంగం తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉండటం వల్లే మేం ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని తెలిపారు.
రాజధానిలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి తప్పించి గవర్నర్ పరిధిలోకి తేవాలని కేంద్రాన్ని గట్టిగా కోరాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications