ఓటమి ఒక వాస్తవం -మళ్లీ గెలిచేదాకా : ఎన్నికలకు ఎన్నారై అభిమానులు: చంద్రబాబు వ్యూహం..!!
టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం తో పాటుగా విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులను ఒకే తాటి పైకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్దం చేసారు. 2024 ఎన్నికల్లో ఎన్నారై అభిమానుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఏపీ లో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని చెబుతూనే.. తెలంగాణలోనూ పార్టీ సంస్థాగతంగా నిర్మాణం పైన ఆయన చర్చలు చేస్తున్నారు. ఇందు కోసం పార్టీ సీనియర్లతో స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
మళ్లీ గెలిచేదాకా విశ్రమించను
పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఓటమి ఒక వాస్తవం.. దానిని కాదనను.. కానీ ఓటమిని నేనెప్పుడూ అంగీకరించను.. మళ్లీ గెలిచేదాకా విశ్రమించను.. 40 ఏళ్ల రాజకీయం నాకు నేర్పిందిదేనంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు.
ఈ సమీక్షలో తెలంగాణ రాజకీయాల పైన సుదీర్ఘంగా చర్చించారు. రైతుల సమస్యలు, విద్యుత్ కష్టాలు, జీవో111 సహా వివిధ అంశాలపైనా చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీ మహానాడు గండిపేట కేంద్రంగా నిర్వహించే అంశం పైన చర్చ జరిగింది. తెలంగాణలో తొలివిడతగా పార్టీ అధినేత 20 నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను ప్రకటించారు.
ఎన్నారై అభిమానులు ఏకతాటిపైకి
ఇక, ఏపీకి చెందిన పలువురు వివిధ దేశాల్లో స్థిర పడ్డారు. ప్రవాసాంధ్రుల సేవలను పార్టీ విజయం కోసం వినియోగిచుకోవటం..అదే విధంగా వారికి పార్టీకి తోడుగా నిలవటం కోసం కొత్త కార్యాచరణ సిద్దం చేసారు. పలు దేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు..వారు ఏర్పాటు చేసుకున్న సంస్థలను ఏకతాటి పైకి తీతీసుకొచ్చే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలతో పాటుగా...మహానాడు నిర్వహణ లో ఎన్నారై అభిమానుల భాగస్వామ్యం పైన చర్చించారు. ఇక, 2024 ఎన్నికల నాటికి ఏపీలో ఎన్నారై టీడీపీ విభాగం సేవలు కీలకంగా సద్వినియోగం చేసుకొనే దిశగా ఇప్పటి నుంచే సంసిద్దులు కావాలని సూచించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా విదేశాల్లో ఉన్న ఎన్నారై టీడీపీ అభిమానులతో పూర్తి జాబితాలు సిద్దం కానున్నాయి.
2024 ఎన్నికల్లో ప్రభావం చేసేలా
ఈ సారి ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకం కావటంతో..ప్రతీ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా యువతను ఆకట్టుకొనేందకు ఇప్పటికే 40 శాతం సీట్లు వచ్చే ఎన్నికల్లో యువతకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక, ఎన్నారైల అభిమానం సైతం పార్టీ గెలుపుకు దోహదపడేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు.
2014, 2019 ఎన్నికల సమయంలోనూ పలువురు టీడీపీ ఎన్నారై అభిమానులు పార్టీ గెలుపు కోసం పని చేసారు. ఈ సారి పార్టీకి విజయం మరింత ప్రతిష్ఠాత్మకం కావటంతో..వారంతా పార్టీ కోసం పని చేసేందుకు.అ.దే సమయంలో ప్రభావితం చేసేందుకు మరోసారి సిద్దం అవుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీని కోసం తొలి నుంచి పార్టీలో ఉంటూ...పలు సంస్థలకు అధ్యక్షులుగా..కీలక స్థానాల్లో పని చేసిన వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.