ప్రపంచం వేగంగా మారుతోంది: పీవీని స్మరించుకున్న చంద్రబాబు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత ప్రధాని పీవీ నర్సింహా రావును స్మరించుకున్నారు. భారత న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన ఘనత పీవీదే అన్నారు. విశాఖలోని దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి శుక్రవారం హాజరై ఆయన ప్రసంగించారు.
ప్రతి న్యాయవాదికి సామాజిక బాధ్యత ఉండాలన్నారు. దేశంలో నాణ్యమైన న్యాయ విద్యకు మంచి డిమాండ్ ఉందన్నారు. న్యాయ విశ్వవిద్యాలయానికి 50 ఎకరాల భూమి, రూ.25 కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
2050 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు. ప్రపంచం వేగంగా మారుతోందన్నారు. నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. న్యాయపట్ట భద్రులకు బంగారు భవిష్యత్తు ఉందని చెప్పారు. న్యాయవాదులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
2018 నాటికి అత్యధిక సాంకేతిక నిపుణులు భారత్లో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.