బస్సు ఆపి మరీ, రామోజీ రావు ఇంటికి బాబు: మళ్లీ వస్తానని ఆయన కొడుకుతో..
ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ పద్ధతి ప్రకారం తన స్వగ్రామం పెదపారుపూడిని అభివృద్ధి చేశారని కొనియాడారు.
అమరావతి: ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ పద్ధతి ప్రకారం తన స్వగ్రామం పెదపారుపూడిని అభివృద్ధి చేశారని కొనియాడారు.
గ్రామంలో మరిన్ని కార్యక్రమాలు చేయమని, రామోజీ తనయుడు కిరణ్కి చెప్పానని చంద్రబాబు అన్నారు. ఆకర్షణీయ గ్రామంగా చేయడంతో పాటు, ప్రజలు కూడా స్మార్ట్గా తయారయ్యేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు.
మళ్లీ వస్తానని కిరణ్కు చెప్పా
సంవత్సరం తర్వాత మళ్లీ వస్తానని, అప్పటిలోగా గ్రామాన్ని స్మార్ట్ విలేజీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికను కిరణ్ అమలు చేస్తామని చెప్పారని, ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. డబ్బుకి సమస్య లేదని, ఖర్చు పెడతామన్నారు.
రామోజీ ఇంటిని సందర్శించిన బాబు
చంద్రబాబు పెదపారుపూడిలో రామోజీ రావు నివసించిన ఇంటిని సందర్శించారు. ప్రస్తుతం అందులో నివసిస్తున్న వారితో కొద్దిసేపు ముచ్చటించారు. రామోజీ ఫిలింసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రామ్మోహన రావు, ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్లతో కలిసి గ్రామంలో బస్సులో ప్రయాణించిన చంద్రబాబు.. రామోజీరావు నివసించిన ఇంటి గురించి వాకబు చేశారు.
బస్సును ఆపి మరీ వెళ్లారు
అటు వైపుగానే వెళుతున్నట్లు తెలుసుకుని బస్సు ఆపించి, వారిద్దరితో కలిసి చొరవగా ఇంట్లోకి వెళ్లారు. అందులో నివసిస్తున్న 90ఏళ్ల అర్జునరావును రామోజీరావు బాల్యం గురించి అడిగారు. రామోజీ బాల్యమంతా ఇక్కడే గడిచిందని అర్జున రావు తెలిపారు. ఆయన వివాహం ఇక్కడే జరిగిందన్నారు. ఆయన ఇంతఉన్నత స్థాయికి వెళతారని ఊహించారా అని చంద్రబాబు ప్రశ్నించగా... తాను అనుకోలేదని బదులిచ్చారు.
చంద్రబాబు వైఫై సదుపాయం కల్పించాలని చెప్పారు
కిరణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్, సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో తన తండ్రి రామోజీ జన్మభూమి పెదపారుపూడిని దత్తత తీసుకున్నారని తెలిపారు. పెదపారుపూడిలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు. గ్రామంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారని కిరణ్ తెలిపారు. పాఠశాలలో వైఫై సదుపాయాన్ని కల్పించనున్నట్టు చెప్పారు. తమ గ్రామానికి వచ్చి అభివృద్ధి పనుల్ని పరిశీలించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ ఏడాది తర్వాత ముఖ్యమంత్రిని ఇక్కడకు రప్పించే స్థాయిలో మన గ్రామం అభివృద్ధి చెందితే రామోజీరావుకు అంతకన్నా ఆనందకరమైన క్షణం ఇంకొకటి ఉండదన్నారు.