YS Jagan Sticker : జగన్ స్టిక్కర్ ప్లాన్ కు చంద్రబాబు కౌంటర్ రెడీ-రేపటి నుంచి అమల్లోకి...
ఏపీలో వైసీపీ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు అధికార పార్టీ వైఎస్ జగన్ స్టిక్కర్లు అతికిస్తోంది. ఈ నాలుగేళ్లలో ఆయా ఇళ్లకు సంక్షేమం అందిందని గుర్తు చేసేందుకు వీలుగా ఈ స్టిక్కర్లను అతికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రెండువారాల పాటు చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు-మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా ఈ స్టిక్కర్లు అతికిస్తున్నారు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి కూడా.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు వైఎస్ స్టిక్కర్లను వైసీపీ అతికిస్తుండగా.. వాటికి కౌంటర్ గా తిరుపతిలో జనసేన, విజయవాడలో టీడీపీ నేతలు పోటీ స్టిక్కర్లను కూడా పక్కనే అంటిస్తున్నారు. దీంతో ఆయా చోట్ల ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు. దీంతో రూటు మార్చాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రేపటి నుంచి పోటీ స్టిక్కర్లు కాకుండా మరో ప్లాన్ అమలు చేయబోతోంది.

రాష్ట్రంలో ఇళ్లకు వైసీపీ స్టిక్కర్లు అతికిస్తున్న నేపథ్యంలో వాటికి పోటీగా స్టిక్కర్లు అతికించడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తడమే తప్ప పెద్దగా ఉపయోగం లేదని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ పోటీ స్టిక్కర్లు కాకుండా జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నవారిని టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాలంటీర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వారిపై ఫిర్యాదులు చేసేందుకు చంద్రబాబు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
స్ధానికంగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఈ మేరకు వాలంటీర్లపై ఫిర్యాదులు చేయాలని నిర్ణయించారు. ఇలా ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఫార్మాట్లను కూడా రాష్ట్రంలో టీడీపీ నేతలకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఫార్మాట్ లో నిబంధనలకు విరుద్ధంగా జగన్ స్టిక్కర్లు అంటిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు, ఇతర వివరాలతో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. సదరు ఫిర్యాదుల్ని రిజిస్టర్ పోస్ట్ లో ఉన్నతాధికారులకు పంపాలని నిర్ణయించారు. వీటి కాపీల్ని జిల్లా కలెక్టర్లకు కూడా పంపనున్నారు. వీటిపై స్పందించకపోతే అప్పుడు కోర్టుల్లో న్యాయపోరాటం చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications