ఎన్డీయేలో చంద్రబాబు రీఎంట్రీకి కీలక షరతు ? జాతీయ మీడియా కథనం..!
ఏపీలో ఒకప్పుడు టీడీపీతో పొత్తుతో లబ్ది పొందిన బీజేపీ.. కేంద్రంతో తమతో పొత్తు కారణంగా ప్రతి లబ్ది పొందిన టీడీపీని తిరిగి అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో ఎన్డీయే నుంచి టీడీపీ విడిపోయి దారుణంగా నష్టపోయిన తర్వాత తిరిగి ఆ పార్టీని దగ్గరకు తీసుకునేందుకు నిరాకరించిన బీజేపీ.. ఆ తర్వాత తిరిగి తన రాజకీయ అవసరాల కోసం వెనక్కి తగ్గింది. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీకి ఉన్న ఓ వర్గం ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు ఆ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్ధాయిలోనూ చర్చకు దారి తీస్తోంది.
ఎన్డీయే నుంచి టీడీపీ విడిపోయాక క్రమంగా బీజేపీకి దగ్గరైన వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చాక మరింత దగ్గరైంది. కేంద్రంలో అడక్కపోయినా ఎన్డీయేకు అన్నివిధాలా అండగా నిలుస్తున్న వైసీపీ ఇప్పుడు బీజేపీకి నమ్మకమైన పరోక్ష మిత్రపక్షంగా మారిపోయింది. అయితే ఇక్కడే ఓ చిక్కు ఉంది. బీజేపీతో నేరుగా కలిస్తే తన ఓటు బ్యాంకు దూరమవుతుందన్న భయంతో వైసీపీ పరోక్ష స్నేహాన్ని మాత్రమే కొనసాగిస్తోంది. కానీ ఇలా పరోక్ష స్నేహం కొనసాగిస్తే బీజేపీకి వచ్చే లాభమేమీ లేదు. దీంతో బీజేపీ ఇప్పుడు మరోసారి టీడీపీకి స్నేహహస్తం చాస్తోంది.

రెండు నెలల క్రితం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. అయితే ఈ చర్చల వివరాలు బయటికి రాకపోయినా తెలంగాణ ఎన్నికల్లో ఇరు పార్టీల పొత్తుపై చర్చించినట్లు తెలిసింది. అలాగే ఏపీలో ఇరుపార్టీల మధ్య అవగాహన పైనా చర్చించారు. అయితే ఏపీలో ఇరు పార్టీల పొత్తు ఉండాలంటే వైసీపీతో బంధాన్ని పూర్తిగా తెంచుకోవాలని చంద్రబాబు అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీపై బీజేపీ రాజకీయవిమర్శల దాడి కూడా పెరిగింది. కనీసం తెలంగాణ ఎన్నికల నాటికి వైసీపీకి బీజేపీ పూర్తిగా దూరమైతేనే ఎన్డీయేలోకి టీడీపీ రీఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తోంది.
బీజేపీతో పొత్తు కోసం గతంలో ప్రయత్నించిన చంద్రబాబు.. మారిన పరిస్ధితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా కర్నాటక ఫలితాల తర్వాత చంద్రబాబు వైఖరిలో మార్పు గమనించిన అమిత్ షా ఢిల్లీ పిలిపించి మాట్లాడారు. అయితే వైసీపీతో బంధాన్ని పూర్తిగా తెంచుకుంటేనే ఎన్డీయేలో రీఎంట్రీ ఇస్తామని చంద్రబాబు ఆయనకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పరోక్షంగా జాతీయ మీడియా నెట్ వర్క్ టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది. దీంతో చంద్రబాబు షరతుకు బీజేపీ ఒప్పుకుంటుందా లేక రిస్క్ తీసుకునేందుకు సిద్దమవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications