ఇసుక టిప్పర్ల కోసం.. ప్రాణాలతో చెలగాటం; కేంద్రమంత్రి ప్రకటనకు జగన్ సమాధానం ఏంటి? చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల విషయంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో, సహాయక చర్యలు చేపట్టడంలో జగన్ సర్కార్ విఫలమైందని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇటీవల వరదల సమయంలో వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల ఏపీ సీఎస్ సమీర్ శర్మకు మానవ తప్పిదం వల్లే వరదలు వచ్చాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలు పోయాయని చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. శనివారం నాడు వరదల పరిస్థితిపై, కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు వైఫల్యంపై, జగన్ వరద ప్రభావిత ప్రాంతాల పరామర్శలపై ప్రెస్ మీట్ నిర్వహించిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదని మండిపడ్డారు.

సీఎం జగన్ కు సిగ్గు లేదా ? ఇసుక టిప్పర్ ల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు చంద్రబాబు. వరదల్లో జనం ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీలో నా ముఖం చూడాలని జగన్ ఇక్కడ ఉన్నారని ఎద్దేవా చేశారు. అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ కాలేదు. అది అప్పటికప్పుడు వచ్చిన సమస్య కాదన్నారు చంద్రబాబు. ఇసుక కోసం వెళ్ళిన టిప్పర్ ల కోసం నీటిని విడుదల చెయ్యకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు చంద్రబాబు. ప్రజల ప్రాణాలు పోవటానికి కారణం అయిన జగన్ సీఎంగా ఉండటానికి అనర్హులు అని చంద్రబాబు పేర్కొన్నారు.

అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా ?
తుమ్మలకుంట చెరువును క్రికెట్ స్టేడియం లా మార్చేశారని, అందువల్లే తిరుపతి మునిగిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. రాయల చెరువు తెగి ఉంటే 35 గ్రామాలు జలమయం అయ్యేవని చంద్రబాబు పేర్కొన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయలేని సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కడతారా అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక ముసలావిడ నవ్వుతూ సీఎం జగన్ ను పొగిడిన అని చెబుతున్నారని రాజకీయం అంటూ మండిపడ్డారు. వరదలకు ప్రాణాలు, ఆస్తులు నష్ట పోతే జనం జగన్ ను చూసి మురిసిపోతారా... స్వాగతం పలుకుతారా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు.

కేంద్ర మంత్రి చేసిన ప్రకటనకు జగన్ ఏం సమాధానం చెప్తారు?
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించక పోవడంతో గేట్లన్నీ కొట్టుకుపోయాయని, ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62 మంది ప్రాణాలు కోల్పోయారు అని చంద్రబాబు ఆరోపించారు. వరదలతో 6 వేల కోట్ల పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ బాధ్యతలకు అతీతుడు కాదని, బాధ్యతలకు వెనకడుగు వేస్తే సీఎంగా ఉండే అర్హత జగన్ కు లేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తెలిసో తెలియకో ప్రజలు ఓట్లు వేస్తే వారి ప్రాణాలు బలిగొంటారా అంటూ మండిపడ్డారు.

వరదల వైఫల్యంలో మీకు బాధ్యత లేదా ? జగన్ కు బాబు సూటి ప్రశ్న
మీకు బాధ్యత లేదా ? మిమ్మల్ని చట్టపరంగా శిక్షించకూడదా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. నిర్లక్యంపై న్యాయ విచారణ చెయ్యాలని అడిగితే ఎందుకు స్పందించలేదో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి 9 మందిని ఎక్కించుకుని చాలావరకు కాపాడాడు. ఏడుగురి ప్రాణాలు కాపాడాడు, మరో ఇద్దరు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు అని చంద్రబాబు పేర్కొన్నారు. వరదలతో పరిస్థితి సీరియస్ గా ఉంటే అది చర్చించకుండా మాపై దాడి చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సొంత జిల్లాకు వెళ్లి ఏం చేశారో చెప్పాలన్నారు చంద్రబాబు. ఎవరూ మాట్లాడకుండా ముందే బాధితులను బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు.

ప్రజలను చంపేందుకు మీకు లైసెన్స్ ఎవరిచ్చారు?
అసలు ప్రజలను చంపేందుకు మీకు లైసెన్స్ ఎవరు ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. వరదల సమయంలో ఏం చెయ్యాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తాము అధికారంలో ఉన్న సమయంలో చేసి చూపించామని చంద్రబాబు చెప్పారు. భారీ వర్షాల వల్ల రెండు సార్లు వరదలు వచ్చాయన్న చంద్రబాబు, ప్రాజెక్ట్ లన్నీ అప్పటికే నిండిపోయాయని, ఆ తర్వాత వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసినా సరైన సమయంలో స్పందించక పోవటం వల్లే విపత్తు వచ్చిందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. విపత్తుకు బాధ్యులైన వారిని శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

టీడీపీ అధికారంలోకి రాగానే పేదల కోసం పని చేస్తాం అన్న చంద్రబాబు
రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. జగన్ పరామర్శల పేరుతో వెళ్లి చేసింది ఏమిటో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో గందరగోళంగా పాలన సాగుతుందని, ఓ టి ఎస్ స్కీం మంచి ప్రోగ్రామ్ అని సీఎం జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు చంద్రబాబు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ప్రజలను 20000 కట్టాలి అని అడగటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ళ పట్టాల విషయంలో కూడా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో పట్టాలు ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ సర్కార్ పై ఇటీవల నిత్యం చంద్రబాబు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. జగన్ ను ప్రభుత్వ వైఫల్యాలపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.












Click it and Unblock the Notifications