కిర్లంపూడికి చిరంజీవి, దాసరి ఎందుకు వెళ్లాలి?: చంద్రబాబు
న్యూఢిల్లీ: కడప నుంచి వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే తుని ఘటనకు కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంఘవిద్రోహ చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని బాబు చెప్పారు.
కులాలు, మతాలతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వల్లే ఢిల్లీ చుట్టూ తిరిగి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటరు నిర్ణయాన్ని సమీక్షించుకుంటామని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై కూడా ఆయన మాట్లాడారు.
స్వార్థపరులే పార్టీలు మారుతున్నారని, తెలంగాణలో ప్రజలు తమతోనే ఉన్నారని చంద్రబాబు మీడియాతో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. కాపులకు న్యాయం చేస్తామని పార్టీ పెట్టిన చిరంజీవి దానిని కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. కాపు గర్జన సందర్భంగా కొన్ని శక్తులు కావాలనే అరాచకం సృష్టించేందుకు ప్రయత్నించాయని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి గడ్కరీని కూడా ఆయన కలిశారు. మంగళవారం ఉదయం నుంచి ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయిన సంగతి తెలిసిందే.