వివేకా కేసులో రంగన్న మృతిపై కేబినెట్ డౌట్స్-జగన్ కుట్రపై చంద్రబాబు అలర్ట్..!
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్ మెన్ రంగన్న చనిపోవడంపై ఇవాళ కేబినెట్లో మంత్రులు, సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా వారు రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మరణాన్ని పోలీసులపై నెట్టేసేందుకు జరిగిన ప్రయత్నాలు చూస్తుంటే ఇందులో జగన్ కుట్ర ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై దాదాపు గంటపాటు కేబినెట్లో చర్చ జరిగింది.
తాజాగా వివేకా కేసు సాక్షి రంగన్న శ్వాస సమస్యలతో చనిపోయినా ఆయన భార్య మాత్రం ఈ మరణంపై ఆనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వివేకా కేసులో ఐదో సాక్షి ఇలా చనిపోవడంతో పోలీసుల పాత్ర ఉందన్న ప్రచారం జరిగింది. దీనిపై ఇవాళ కేబినెట్లో సీఎం చంద్రబాబుకు మంత్రులు వివరాలు అందించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు రంగన్న మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమే అని వ్యాఖ్యానించారు.

రంగన్న మృతిని పోలీసులకు ఆపాదించేందుకు జరిగిన ప్రయత్నాలపై మంత్రులు సీఎం చంద్రబాబుకు వివరించారు. అలాగే రంగన్న మరణాన్ని ప్రభుత్వంపైకి నెట్టేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే వివేకా కేసులో మరో సాక్షి, అప్రూవర్ దస్తగిరికి బెదిరింపులు రాపడంపైనా చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ కూడా కేబినెట్లో మంత్రులకు ఈ వ్యవహారంపై బ్రీఫింగ్ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ జగన్ కుట్రలపై అలర్ట్ గా ఉండాలని తాను పదే పదే చెబుతున్నట్లు మంత్రులకు గుర్తుచేశారు. గతంలో పరిటాల రవి కేసులోనూ ఇలాగే సాక్షులు చనిపోతూ వచ్చారన్నారు.
వివేకా హత్య జరిగినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను మంత్రులకు చంద్రబాబు మరోసారి వివరించారు. స్వలాభం కోసం రాజకీయాలను జగన్ నేరపూరితంగా మార్చేశారన్నారు. అలాగే వివేకా కేసులోనూ గుండెపోటని, గొడ్డలిపోటని తనపై నెట్టేందుకు ప్రయత్నించారన్నారు. కాబట్టి జగన్ చేసే కుట్రలపై మంత్రులు అలర్ట్ గా ఉండాలన్నారు. అనుమానాలతోనే రంగన్న కేసును ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications