మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ కు చంద్రబాబు బిగ్ రిలీఫ్..!
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో క్రిమినల్ కేసు నమోదు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో నమోదు చేసిన ఈ కేసు ఛార్జిషీట్ ను కూడా దాఖలు చేశారు. అయితే ఆ తర్వాత ఈ ఛార్జిషీట్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఆ తర్వాత ఆయనకు పోస్టింగ్ కూడా దక్కింది.
నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో జగన్ సర్కార్ నమోదు చేసిన కేసును కొట్టేస్తూ హైకోర్టు ఈ ఏడాది మే నెలలో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉండగా.. తదుపరి చర్యలపై సీఎం చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించరాదని నిర్ణయించిన ప్రభుత్వం తదుపరి చర్యల్ని నిలిపేస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావుకు పూర్తి స్ధాయిలో ఉపశమనం దక్కింది.

ఏబీ వెంకటేశ్వరరావును గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల్ని టార్గెట్ చేసేందుకు నిఘా పరికరాలు కొన్నారన్న ఆరోపణలపై జగన్ సర్కార్ టార్గెట్ చేసింది. ఈ కేసులోనే ఆయన్ను ఓసారి సస్పెండ్ చేయగా.. ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లి విజయం సాధించారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేసారంటూ మరోసారి సస్పెండ్ చేసింది. అఖిల భారత అధికారుల సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించారని అందులో పేర్కొంది. ఈ ఆరోపణల్ని సైతం హైకోర్టు కొట్టేయడంతో రిటైర్మెంట్ రోజే ఆయనకు పోస్టింగ్ దక్కింది. దీంతో ఒక్క రోజు పని చేసి ఆయన రిటైర్ అయ్యారు.
అయితే మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆయనపై కేసుల నుంచి పూర్తి స్దాయి విముక్తి లభించలేదు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ కేసుల వ్యవహారం కొనసాగడంతో ఏబీ వెంకటేశ్వరరావు అసంతృప్తిగా ఉన్నారు. ఓ దశలో ఆయనకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గా కూడా నియమించింది. అయితే ఆయన ఆ పదవి తీసుకోకుండా దూరంగా ఉండిపోయారు. చివరికి జగన్ హయాంలో బాధితులుగా ఉన్న పలువురిని కలిసి వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో ప్రభుత్వం ఇవాళ ఆయనకు పూర్తి స్దాయిలో ఊరట కల్పించింది.












Click it and Unblock the Notifications