ఏపీలో పెన్షనర్లకు మరో షాక్-ఈసారి 18 వేల మంది అవుట్ ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 65 లక్షల మందికి అసరా పెన్షన్లు లభించేవి. ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటిని క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. అనర్హుల్ని పెన్షన్ల జాబితాలో నుంచి తొలగించేందుకు పలు సర్వేలు చేస్తున్న అధికారులు.. ప్రతీ నెలా కోత పెడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఫిబ్రవరి నెలకు ఇస్తున్న పెన్షన్లలో 18 వేల మంది లబ్దిదారుల్ని కోత పెట్టారు.
రాష్ట్రంలో తాజాగా దివ్యాంగుల పెన్షన్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా దివ్యాంగులకు జారీ చేసే సదరం సర్ఠిఫికెట్లను వెరిఫికేషన్ చేయడం మొదలుపెట్టింది. డాక్టర్లు వారికి జారీ చేసిన సర్టిఫికెట్లలో నకిలీలు గుర్తించడం ప్రారంభించారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది నకిలీలు ఉన్నట్లు తేలింది. దీంతో వీరిని లబ్దిదారుల జాబితా నుంచి అధికారులు తొలగించారు. వీరితో పాటు మరికొందరు అనర్హుల్ని కూడా తొలగించడంతో ఏకంగా 18 వేల మంది జాబితా నుంచి అవుట్ అయ్యారు.

ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ లబ్దిదారుల జాబితాలో 63,77,9443 మంది ఉన్నారు. వీరి సంఖ్య ఫిబ్రవరికి వచ్చే సరికి 63, 59,907కి తగ్గింది. దీంతో మొత్తం 18 వేల 036 మందిని తొలగించినట్లు అర్ధమవుతోంది. వివిధ జిల్లాల్లో అధికారులు సేకరించిన వివరాల ప్రకారం వీరిని లబ్దిదారుల జాబితా నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ తొలగింపు తర్వాత అర్హులకు మాత్రం ఇవాళ చురుగ్గా అధికారులు పెన్షన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లాకు వెళ్లి మరీ స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications