అది కరెక్ట్: జగన్కు బాబు సమాధానం, శ్వేతపత్రం రిలీజ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం వ్యవసాయం, నీటి పారుదల పైన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎర్రచందనం అమ్మకం సమర్థనీయమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పడతామని చెప్పారు. రుణమాఫీ కోసం ఎర్రచందనం అమ్మడంపై జగన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
వ్యవసాయం పైన పదేళ్లుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయన్నారు. రుణమాఫీతోనే రైతుల సమస్యలు అన్నీ తీరవని, ఇది ఆరంభం మాత్రమే అన్నారు. గత పదేళ్లలో వ్యవసాయం కుదేలైందన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. రైతులు అప్పుల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనలో రైతులు అప్పులపాలయ్యారన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పారు. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. పేదరిక నిర్మూలనకు, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు కృషి చేస్తామన్నారు. మేఘమధనం పేరిట రూ.కోట్లు దండుకున్నారని కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు. పదేళ్లలో వ్యవసాయ ఉత్పత్తుల పెట్టుబడులు పెరిగాయన్నారు. అనుబంధ పరిశ్రమలతో వ్యవసాయానికి మరింత ఊతమిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, రైతులకు ఆసరాగా ఉంటామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుకు అందిస్తామన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. ఇజ్రాయెల్ తరహా సాగు చేయాలన్నారు. భూసారాన్ని పెంచి దిగుబడి పెంచుతామన్నారు. నీటిని పరిరక్షించుకోవడం, సద్వినియోగంపై దృష్టి సారిస్తామన్నారు. పంట రక్షణకు సాంకేతిక విధానం అమలు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications