విద్యుత్పై చంద్రబాబు శ్వేతపత్రం: కెసిఆర్కు సూచన
హైదరాబాద్: రాష్ట్ర అవసరాల మేరకు విద్యుత్ ఉత్పత్తి సాధించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ పరంగా బాగా నష్టపోయిందని చెప్పారు. విభజన వల్ల 1142 మెగావాట్ల విద్యుత్ను ఏపి నష్టపోయిందని వివరించారు. విభజన వల్ల ఏర్పడిన నష్టాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
పది సంవత్సరాల కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలు అస్తవ్యస్థంగా మారాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అందరి సహకారం కావాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. విభజన తర్వాత ఏపిలో అనేక సమస్యలు వచ్చాయని తెలిపారు. విభజన ఇష్టారాజ్యంగా చేశారన్న ఆయన, తెలంగాణ, ఏపిలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, రెండు రాష్ట్రాలకు విద్యుత్ కావాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
ఏపి అభివృద్ధి కోసం కేంద్రం సహాయాన్ని కోరుతున్నామని చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై చర్చిస్తున్నామని అన్నారు. త్వరలోనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. కేంద్రం, రిజర్వు బ్యాంకు నుంచి స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర సహాయం కోసం ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి సమస్యలను వివరించినట్లు చంద్రబాబు తెలిపారు. నెలలో మూడు సార్లు కేబినెట్ భేటీలు జరుపుతున్నట్లు చెప్పారు. ఏపి అభివృద్ధికి పక్కా రాష్ట్రాల సిఎంలు, కేంద్రమంత్రులు సహకారం అవసరం అన్నారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం విద్యుత్ రంగంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని తెలిపారు. గత పదేళ్లలో విద్యుత్ రంగం తిరోగమనంలో పయనించిందని అన్నారు. విభజన తర్వాత అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్రం గాడిలో పడే వరకు కేంద్రం సహకారం కావాలని ఆయన అన్నారు. నాణ్యమైన కరెంటును అందించడం, మిగులు విద్యుత్ను ఉత్పత్తి చేయడమే లక్ష్యమని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని ఆరోపించారు. మాజీ సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్రంపై 7వేల కోట్ల రూపాయల భారం పడిందని చెప్పారు. రాష్ట్రంలోని విద్యుత్ లోటును తీర్చేందుకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని చెప్పారు. వీలైనంత త్వరలో వర్షాలు పడిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు.
మొదట వ్యవసాయానికి 7గంటల విద్యుత్ ఇచ్చి.. ఆ తర్వాత అది 9గంటలకు పెంచుతామని చెప్పారు. పారిశ్రామిక రంగానికి 24 గంటల విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ, ఏపి రాష్ట్రాలకు విద్యుత్ అందించేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ఒకరికొకరు సహకరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు చంద్రబాబు సూచించారు. తానేప్పుడు సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పారు. హైదరాబాద్లో అక్రమ భవనాల కూల్చివేతపై స్పందించాలని కోరగా.. తానిప్పుడు స్పందించనని, అనవసరంగా మాట్లాడితే వివాదాలు తలెత్తే అవకాశం తెలిపారు.












Click it and Unblock the Notifications