‘బాహుబలి’లోలా తండ్రి సాహసం: చంద్రబాబు స్పందించారు
విశాఖపట్నం: జిల్లాలోని కుడుముసారి వాగుపై వెంటనే వంతెన నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లా అధికారులను ఆదేశించారు. గిరిజనులు పడుతున్న బాధలు తన దృష్టికి రావడంతో చంద్రబాబు వెంటనే స్పందించారు.
ఎక్కడ?: చిన్నారి ప్రాణం కోసం 'బాహుబలి'లోలా తండ్రి సాహసం
విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలం కుడుముసారి కుడుముసారి గ్రామానికి చెందిన పాంగి సత్తెబాబు అనారోగ్యంతో బాధపడుతున్న తన ఏడాది కుమార్తెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు బాబాయి సహాయంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్న చిత్రాలు బుధవారం మీడియాలో విస్తృతంగా ప్రచురితమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... జిల్లా కలెక్టర్, పాడేరు ఇంఛార్జి పీవోతో మాట్లాడారు. కుడుముసారి పంచాయతీకి చెందిన 12 గ్రామాల ఆదివాసీల ఇబ్బందులు తీర్చే వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
ఈమేరకు రూ.రెండు కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి ముఖ్యమంత్రికి పంపించారు. కాగా, ముఖ్యమంత్రి స్పందనతో తమ కష్టాలు తీరుతాయని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.