విదేశాల నుంచి చంద్రబాబు రిటర్న్..! టూర్ పై టీడీపీ క్లారిటీ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నుంచి తిరిగి రానున్నారు. చంద్రబాబు తాజాగా విదేశీ టూర్ కు రహస్యంగా వెళ్లడంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. కొత్త సంవత్సర వేళ చంద్రబాబు సీఎం హోదాలో అధికారిక షెడ్యూల్ విడుదల చేయకుండానే విదేశీ పర్యటనకు వెళ్లడంపై విపక్ష వైఎస్సార్సీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి వస్తున్నట్లు టీడీపీ వర్గాలు ఇవాళ వెల్లడించాయి.
చంద్రబాబు రేపు సాయంత్రం నాలుగున్నరకు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి విదేశాల నుంచి వస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అనంతరం హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుని అనంతరం ఎల్లుండి అమరావతికి వచ్చే అవకాశముంది.
కొత్త సంవత్సరం వేళ ఉన్నట్లుండి విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఆ టూర్ వ్యక్తిగతమా లేక అధికారికమా అనే వివరాలు ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది. దీంతో వైసీపీ కూడా విమర్శలకు దిగింది. ప్రజలకు సమాచారం లేకుండా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కూడా విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తోంది.

అలాగే టీడీపీ వర్గాలు, ప్రభుత్వ అధికారులు కూడా ఈసారి చంద్రబాబు విదేశీ పర్యటనపై నోరు మెదపలేదు. దీంతో కొత్త ఏడాది వేళ ఇంత రహస్యంగా ఎందుకు చంద్రబాబు ఇలా ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్లారన్న దానిపై రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది. దీనికి మరో కారణం గతంలో చంద్రబాబు ఎప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా ఓ వర్గం మీడియాలో పూర్తి వివరాలు మినిట్ టూ మినిట్ అప్ డేట్స్ కనిపించేవి. ఈసారి అవి కూడా కనిపించకపోవడంతో రహస్య టూర్ పై చర్చ జరుగుతోంది. మరోవైపు చంద్రబాబు నాలుగు రోజులు కుటుంబంతో విదేశాలకు వెళ్తే వైసీపీ సైకోలు ఓర్చుకోలేకపోతున్నారని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇవాళ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంపై నిరంతర సమీక్ష చేస్తున్నారని తెలిపారు. రేపు ఆయన పార్టీ కార్యాలయంలో ఉంటారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications